Natural Farming: ఓవైపు ప్రభుత్వ ఉద్యోగం.. మరోవైపు ప్రకృతి సేద్యం

Natural Farming: నేల సారం మన జీవనాభివృద్ధికి సారాంశం. ప్రకృతి మనకిచ్చిన ఈ అపురూపమైన కానుకను మనం చేజేతులారా నాశనం చేసుకుంటున్నాము.

Arun Chilukuri
Updated on: 29 Jun 2021 2:19 PM IST
Sweet Lime Farming | Govt.Employee Success Story
X

Natural Farming: ఓవైపు ప్రభుత్వ ఉద్యోగం.. మరోవైపు ప్రకృతి సేద్యం

Natural Farming: నేల సారం మన జీవనాభివృద్ధికి సారాంశం. ప్రకృతి మనకిచ్చిన ఈ అపురూపమైన కానుకను మనం చేజేతులారా నాశనం చేసుకుంటున్నాము. పురుగు మందులు, కలుపు మందులు, కృత్రియ ఎరువులు వంటి ప్రమాదకరమైన వాటిని పంటల సాగులో వాడి నేలలను, పంటలను తద్వారా మన ఆరోగ్యాన్ని అంతిమంగా ప్రకృతిని నిస్సారము చేస్తున్నాము. చివరకు రైతులు ఎరువులు, పురుగు మందులు లేకుండా పంటలు పండించలేని స్థితికి చేరుకుంటున్నారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని కాపాడుకోకపోతే రాబోయే తరానికి ఆరోగ్య భద్రత, ఆహార భద్రతను అందించడం సాధ్యం కాదని గుర్తించిన నల్గొండ జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు అరవింద్ రెడ్డి దండగలా మారుతున్న వ్యవసాయన్ని పండుగగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు. పాలేకర్ పెట్టుబడి లేని ప్రకృతి విధానాన్ని అనుసరించి బత్తాయి సాగు చేపట్టారు. సత్ఫలితాలను సాధిస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

నల్గొండ జిల్లా జొన్నలగడ్డ గూడేం గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఈయనది వ్యవసాయ కుటుంబం. గత 40 ఏళ్లుగా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు సేద్యపు పనుల్లో చేదోడువాదోడుగా నిలిచేవారు. అయితే వారు రసాయనిక సేద్యం చేశేవారు. ఈ సేద్యంలో అనేక కష్ట నష్టాలు ఉన్నాయని గుర్తించిన వెంకట్‌రెడ్డి ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్‌ పాలేకర్ విధానాలకు ఆకర్షితులయ్యారు. 2016 సంవత్సరంలో సొంతూరుకు బదిలీ అయిన అరవింద్ రెడ్డి ప్రకృతి వ్యవసాయంలో ఏఏ పనులు ఎప్పుడు చేయాలో పూర్తిగా తెలుసుకున్నాడు. సాగుపై పట్టు సాధించాడు. దీంతో 2018లో తనకున్న నాలుగు ఎకరాల పొలంలో ప్రకృతి పద్ధతిలో బత్తాయి సాగు చేపట్టారు.

నాలుగు ఎకరాల్లో రంగాపూర్ వెరైటీకి చెందిన 370 మొక్కలను పొలంలో నాటారు. మొక్కలు నాటినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి ప్రకృతి వాధానాలనే అనుసరిస్తున్నారు. పాలేకర్ సూచిస్తున్న జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు, మల్చింగ్ పద్ధతులను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. సత్ఫలితాలను సాధిస్తున్నారు.

ఈ మూడు సంవత్సరాలలో ఎలాంటి రసాయనాలను బత్తాయి తోటకు వాడలేదంటున్నారు అరవింద్ రెడ్డి. పాలేకర్ సూచించిన ప్రకృతి ద్రావణాలతో పాటు వేప గింజల కషాయాలు, పుల్లటి మజ్జి, మట్టి ద్రావణాలను సాగులో వినియోగిస్తున్నారు. ఇవి మంచి ఫలితాలే ఇస్తున్నాయని అంటున్నారు. నేలలో కర్బనం శాతం పెంచేందుకు బత్తాయి మొక్క మొదళ్లల్లో వేప, ఆముదం పిండితో పాటు పశువుల పేడను మొక్కకు అందించారు. వీటితో పాటు పచ్చిరొట్ట పైర్లను సాగు చేస్తూ నేలకు జీవం పోస్తున్నారు.

భావితరానికి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలన్నదే తన ప్రధాన ఉద్దేశమని అంటున్నారు ఈ రైతు. అందుకోసం సేద్యంలో నిత్యం ప్రయోగాలు చేస్తుంటానని చెబుతున్నాడు. తోటి రైతులు ప్రకృతి పద్ధతులను పాటించి సేద్యంలో రాణించాలని సూచిస్తున్నాడు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story