అన్నదాతకు కొండంత భరోసాగా ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం

అన్నదాతకు కొండంత భరోసాగా ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం
x
Highlights

రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించినా కొన్నిసార్లు వాతావరణంలో వచ్చే మార్పుల వల్లగాని, ప్రకృతి వైపరీత్యాల వల్లగాని పంటలు చేతికందని పరిస్థితి...

రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించినా కొన్నిసార్లు వాతావరణంలో వచ్చే మార్పుల వల్లగాని, ప్రకృతి వైపరీత్యాల వల్లగాని పంటలు చేతికందని పరిస్థితి నెలకొంటోంది. ఇలాంటి సమయంలో పంటలకు బీమా ఉంటే నష‌్టపోయన మొత్తానికి బీమాసంస్థ నుంచి ఆర్ధిక సాయం అందుతుంది. ఇందులో భాగంగానే రైతులు నష్టపోకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌బీమా పథకాన్ని అమలు చేస్తోంది. కానీ చాలా మంది రైతులకు ఈ పథకంపై పూర్తి అవగాహన లేదు. అసలు బీమా ఏ పంటలకు వర్తిస్తుంది. బీమా తీసుకోవాలంటే ఏం చేయాలి? బీమా కల్పిస్తున్న కంపెనీలేంటో తెలియవు అందుకే ప్రస్తుతం అమలవుతున్న ఫసల్ బీమా పథకంపై పూర్తి సమాచారాన్ని తెలుసుకుందా ఈ ప్రత్యేక కథనంలో.

కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా 1985 లో సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తరువాత కొన్ని మార్పులతో 1999-2000లో జాతీయ వ్యవసాయ బీమా పథకం, కొంతకాలం తరువాత 2010-2011 సంవత్సరంలో సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని తీసుకొచ్చింది. 2016లో వ్యవసాయ కార్మికుల ప్రయోజనం కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ వ్యవసాయ విభాగాల ద్వారా బీమా కంపెనీల ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ చాలా మంది రైతులకు ఈ పథకం గురించి తెలియకపోవడం విచారకరం.

దేశంలో చిన్న, సన్నకారు రైతుల సంఖ్యే అధికం. అందుకే అందరికీ ఉపయోగపడే పథకాన్ని రూపొందించడం కత్తిమీద సాము లాంటిదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకిచ్చే పంటల భరోసా పథకమిది. పంటల బీమా పథకంలో కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా ఇన్సురెన్స్ చెల్లించే పథకం ఇదే. ఈ పథకంలో రైతులు చాలా తక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లిస్తారు. ప్రభుత్వ రాయితీపై గరిష్ట పరిమితి లేదు. ప్రీమియం 90 శాతం ఉన్నప్పటికి అంతా ప్రభుత్వమే భరిస్తుంది. ఆహారధాన్యాలు లేదా నూనెగింజలకు ప్రతి సీజన్‌కు ఒకే రకమైన ప్రీమియాన్ని నిర్ణయించగా ఖరీఫ్ పంట కాలానికి రైతు 2 శాతం, రబీకి అయితే 1.5 శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. వార్షిక వాణిజ్య , ఉద్యానవన పంటలకు రైతు కట్టాల్సిన ప్రీమియం ఖరీఫ్‌, రబీకాలంలో 5 శాతంగా ఉంటుంది. ఇలా ప్రీమియం కట్టినప్పుడు పొలంలో ఉన్న పంటకు జరిగిన నష్టంతో పాటు విత్తులు లేదా నాట్లు వేయలేకపోవడం, పంట కోత తరువాత జరిగే నష్టాలకు బీమా వర్తిస్తుంది.

పంటనష్టం జరిగిందని తెలియగానే బీమా మొత్తంలో 25 శాతం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. వరద వంటి విపత్తులకు కూడా బీమా వర్తిస్తుంది. ఈ పథకంలో మొత్తం ప్రీమయంలో రైతు కట్టగా మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. ఈ పథకం ప్రాంతాల వారీగా అమలవుతుంది. ప్రతి జిల్లాలో ఒక ప్రధానపంటకు గ్రామం ఒక బీమా యూనిట్‌గా అమలవుతుంది. పంట నష్టపరిహారాన్ని పంట కోత ప్రయోగాల ద్వారా నిర్థారిస్తారు. క్లెయిమ్ సెటిల్ కోసం పంట నష్టాన్ని అంచనా వేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడతారు. స్మార్ట్‌ ఫోన్ ద్వారా పంటకోత సమాచారాన్ని ఫోటోలు తీసి, అప్లోడ్ చేస్తారు. పంట కోతలను పరిశీలించేందుకు రిమోట్ సెన్సింగ్‌లను వినియోగిస్తారు. బ్యాంకు ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతులకు తప్పనిసరిగా బ్యాంకు ద్వారా బీమా చేస్తారు. బ్యాంకురుణాలు తీసుకోని రైతులు మీ సేవా, బీమా కంపెనీలు నిర్ధారించి సంస్థల ద్వారా బీమా చేస్తారు.

చాలా మంది రైతులు తమ పంటలకు బీమా చేసినప్పటికీ పరిహారం ఎలా పొందాలో తెలియక నష్టపోతున్నారు. కాబట్టి పంట నష్టపోయినప్పడు పరిహారం పొందే విధానమేంటి? అసలు బీమా ఎప్పు వర్తిస్తుంది? ఎప్పుడు వర్తించదు ? రైతులు పంట నష్టం జరిగిన వెంటనే ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

అగ్నిప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, వడగళ్లు, తుపాను, అనావృష్టి, వరదలు, నీటమునిగిపోవడం, తెగుళ‌్లు, ప్రతికూల వాతావరణం మొదలైన వాటివల్ల కలిగే దిగుబడి ఆధారంగా నష్టపరిహారం చెల్లిస్తారు. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాన పంటలను రైతులు విత్తలేకపోవడం లేదా నాట్లు వేయలేకపోవడం వల్ల కలిగే ఆర్థిక నష్టానికి బీమా మొత్తంలో 25 శాతం వరకు సత్వరమే నష‌్టపరిహారం చెల్లిస్తారు.

స్థానికంగా వచ్చే విపత్తులు అంటే పంట పొలాలు నీట మునిగిపోవడం, వడగళ్ల వాన కురవడం, మట్టిపెళ్లలు విరిగిపడిపోవడం మొదలైన వాటివల్ల జరిగే నష్టాన్ని అంచనా వేసి రైతుకు పరిహారం చెల్లిస్తారు. పంట మధ్యకాలంలో నష్టపోతే అంచనా వేసి పరిహారంలో 25 శాతం రైతుకు ముందస్తుగా చెల్లిస్తారు. పంటకోతల తరువాత పొలంలో ఆరబెట్టిన పంటకు 14 రోజుల వరకు తుపాన్లు, అకాల వర్షాల వల్ల పంటకు నష్టం జరిగినప్పుడు కూడా పరిహారం చెల్లిస్తారు.

యుద్ధం, ముట్టడి, విదేశీ శత్రువుల చర్య, పౌర కల్లోలం, దోపిడి వల్ల నష్టం జరిగినప్పుడు బీమా వర్తించదు. అలానే అణుఇంధనం, వెలువడి అణువ్యర్థాల నుంచి వచ్చే రేడియోధార్మికత వల్ల వచ్చే కాలుష్యం వల్ల ఆస్తి నష్టం జరిగినా, శారీరక గాయాలై అనారోగ్యం కలిగినా బీమా వర్తించదు. ఈ విధానం అందరు రైతులకు గుర్తింపు పొందిన ప్రాంతాల్లో భూస్వామికి అనువుగా ఉంటుంది.

చాలా మంది రైతులు తమ పంటలకు బీమా చేసినప్పటికీ పరిహారం ఎలా పొందాలో తెలియక నష్టపోతున్నారు. కాబట్టి పంట నష్టపోయినప్పడు పరిహారం పొందాలంటే రైతులు తమ పొలం ఉన్న ప్రాంతం ఏ సాధారణ బీమా కంపెనీ పరిధిలో ఉందో తెలుసుకోవాలి. రైతులు పండించే పంట భారత ప్రభుత్వం నిర్దేశించిన పంటల్లో ఉందో లేదో చూసుకోవాలి. బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రైతు సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాలి. బ్యాంకులో ఎలాంటి రుణం తీసుకోనివారు సదురు బీమా కంపెనీ నిర్దేశించిన సంస్థను లేదా దగ్గరలో ఉన్న మీసేవా కేంద్రానికి సంబంధిత పత్రాలను అంటే రైతు పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీ, రైతు పేరుతో ఉన్న బ్యాంకు పాసుబుక్ కాపీ, ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీ, వ్యవసాయశాఖ నుంచి పొందిన విత్తన పత్రం ఒరిజినల్ కాపీ తీసుకెళ్లి సంప్రదించాలి.

ప్రపోజల్ ఫారాన్ని రైతులు పూర్తిగా నింపాలి. ఏ సర్వే నంబరులో పంట బీమా చేయాలనుకుంటున్నారో ఆ సర్వే నంబరు, విస్తీర్ణం గురించి పూర్తి వివరాలు రాయాలి. రైతులు బీమా చేయించాలనుకుంటున్న విస్తీర్ణాన్ని బట్టి ఎంత ప్రీమియం కట్టాలో తెలుసుకుని సరిపడా డి.డి తీసి అన్ని పత్రాలతో పాటు డి.డి. ని జత పరచాలి లేదా బీమా కంపెనీ అకౌంట్ నంబరుకు నెఫ్ట్‌ ద్వారా నిర్ధారించిన చివరి తేదిలోపు ప్రీమియం సొమ్మును చెల్లించి, బ్యాంకు వారు ఇచ్చిన రసీదుతో యు.టి.ఆర్‌. నంబరును పత్రాలకు జతపరచాలి. రైతులకు పంటనష్టం జరిగినప్పుడు వెంటనే సంబంధిత బీమా కంపెనీకి తెలియజేయాలి.

రైతులు పండించే అన్ని పంటలకు బీమా సౌకర్యం లభిస్తుందా? బీమాకు అవకాశమున్న పంటలేంటి? పంట బీమా నమోదుకు గడువు ఎప్పుడు పూర్తవుతుంది. బీమా కల్పిస్తున్న కంపెనీల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో సుమారు 29 సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. వాటిలో ప్రభుత్వ వ్యవసాయ కంపెనీ,ఓరియంటల్ ఇన్సురెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సురెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సురెన్స్ కంపెనీ, నేషనల్ ఇన్సురెన్స్ కంపెనీ, అలాగే కొన్ని ప్రైవేటు సాధారణ బీమా కంపెనీలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్థేశించిన అంశాలకు లోబడి, వివిధ ప్రాంతాలకు టెండర్ ప్రక్రియ ద్వారా రైతులకు పంటలబీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అలాంటి వాటిలో ఎస్‌.బి.ఐ, జనరల్ ఇన్సురెన్స్, ఐ.సి.ఐ.సి.ఐ లాంబార్డ్, బజాజ్ అలియాంజ్ ఇన్సురెన్స్, ఇఫ్‌కో టోకియో జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్ మొదలైనవి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

రైతులు పండించే అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం అందుబాటులో లేదు. శీతోష్ణస్థితి, వ్యవసాయ పద్ధతులను అనుసరించి కేంద్ర ప్రభుత్వం పంటల బీమాకు అవకాశం కల్పిస్తోంది. వరి, గోధుమలు, పప్పుధాన్యాలు,మిర్చి, ఆముదం, వేరుసెనగ, జీడిపప్పు, అవిశ, అరటి, పత్తి ,మామిడి మొదలైన పంటలు పండించే రైతులు బీమా పథకానికి ధరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో చేరే వానకాలం సీజన్‌లో వరి పంటకుగాను ఆగస్టు 31 లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. జొన్న,మొక్కజొన్న, కంది, పెసర, మినుము, వేరుసెనగ, సోయాబీన్, పసుపు సాగు చేసే రైతులు జులై 31 లోగా నమోదు చేసుకోవాలి. వానకాలంలో పునరుద్ధరిచంన వాతావరణ ఆధారిత పంటలబీమా పథకం కింద మిర్చి పంటకు ఆగస్టు 31 లోగా, పత్తికి జులై 15 , పామాయిల్‌కు జులై 14, బత్తాయికి ఆగస్టు 9 , టొమాటో పంటకు ఆగస్టు 31 తేదీలోగా రైతులు నమోదు చేసుకోవాలి.

2019 రబీ సీజన్‌కు ఫసల్‌బీమా యోజన కింద శనగ పంటకు నవంబర్ 30 లోగా, మొక్కజొన్న కు డిసెంబరు 15, వరి, జొన్న,పెసర, మినుము, వేరుసెనగ, పొద్దుతిరుగుడు, ఉల్లి, మిర్చి, నువ్వులు పంటలకు డిసెంబరు 31 లోగా రైతులు నమోదు చేయించుకోవాలి. ఆర్‌.డబ్ల్యూ.బి.సి.ఐ పథకం కింద టొమాటో పంటకు నవంబరు 30 లోగా, మామిడి తోటలకు డిసెంబరు 31 లోగా రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలి.

తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు పంట బీమా చేయడంలో చాలా వెనుకబడి ఉన్నారు. రాబోయే ఖరీఫ్ కు బ్యాంకు నుంచి పంట రుణాలు తీసుకునే రైతులు తప్పనిసరిగా పంటల బీమా చేయించడం ఉత్తమం. ప్రకృతి విపత్తుల కారణంగానో, వాతావరణంలో నెలకొన్న మార్పుల కారణంగానో పంట నష్టపోయినా బీమా చేయించుకోవడం వల్ల కాస్త ఊరట లభిస్తుంది. రైతుకు కొండంత భరోసాను కల్పిస్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories