ఉల్లి కుళ్లకుండా నిల్వ చేసేందుకు నూతన విధానం

Onion Farming Haryana Farmer Success Story
x

ఉల్లి కుళ్లకుండా నిల్వ చేసేందుకు నూతన విధానం

Highlights

Onion Farming: పంట ఏదైనా రైతు చేతికి వచ్చిన వెంటనే అమ్మేకంటే కొద్ది నెలలు నిల్వ చేసుకుంటే అనేక రెట్లు ఎక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది.

Onion Farming: పంట ఏదైనా రైతు చేతికి వచ్చిన వెంటనే అమ్మేకంటే కొద్ది నెలలు నిల్వ చేసుకుంటే అనేక రెట్లు ఎక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. ఉల్లి పంట కూడా అంతే . అయితే ఉల్లిపాయలను నిల్వ చేయడం చాలా కష్టతరమైన పని. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కనీసం పది శాతం పాయలైనా కుళ్లిపోతుంటాయి. ఈ సమస్యకు హరియాణాకు చెందిన ఓ అభ్యుదయ రైతు అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. పైసా ఖర్చు లేకుండా నెలల తరబడి పంటను నిల్వ చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు.

చాలా మంది రైతులు పంట కోసిన వెంటనే విక్రయించరు. కొద్ది నెలలు నిల్వ చేసుకుని మార్కెట్‌లో ఆశాజనకమైన ధర పలికితేనే పంటను అమ్ముకుంటారు. ఉల్లి సాగు చేసే రైతులు ఎక్కువగా ఈ విధానాన్నే అనుసరిస్తారు. ఉల్లిపాయలను సాధారణంగా రైతులు గోనె సంచుల్లో నిల్వచేస్తారు. త్వరగా కుళ్లిపేయే స్వభావం ఉన్న ఉల్లిపాయలను ఇలా నిల్వ చేయడం వల్ల రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హరియాణాకు చెందిన ఓ రైతు ఖర్చులేకుండా సమర్థవంతంగా నెలల తరబడి ఉల్లి నిల్వ చేసే పద్ధతిని కనిపెట్టారు. ఈ ప్రయోగం సత్పలితాలను అందిస్తుండటంతో అక్కడి గ్రామంలోని రైతులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు.

హరియాణాకు చెందిన సుమేర్ సింగ్‌కు 14 ఎకరాల పొలం ఉంది. ఈయన 1999 సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇతర రైతుల మాదిరిగానే రసాయన ఎరువులు, పురుగుమందులు వాడుతూ పంటల సాగు కొనసాగించారు. గతంలో తగినంత సాగు నీరు అందుబాటులో లేకపోవడంతో ఎక్కువగా పత్తి విత్తేవారు. ఏళ్లపాటు పత్తినే సాగు చేస్తుండటం, రసాయనాల వినియోగం వల్ల నేలలో సారం లోపించడాన్ని ఈ రైతు గమనించారు. పురుగు మందుల పిచికారీతో కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలై వైద్య ఖర్చులు పెరుగుతుండటం రైతును కలిచివేసింది. పంట మార్పిడితో పాటు సేంద్రియ సేద్య విధానాన్ని ఆచరించడం వల్ల ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలుసుకున్నారు. గత ఆరేళ్లుగా కూరగాయలు, అపరాలు, శనగ, చిరుధాన్యాలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ మేలైన ఫలితాలను సాధిస్తున్నారు.

వివిధ రకాల కూరగాయలతో పాటు ఉల్లి పంటను సాగు చేస్తున్నారు సుమేర్ సింగ్. ఉల్లి వరుసల మధ్య మల్చింగ్ కోసం ఇతర రైతులు ప్లాస్టిక్ మల్చింగ్ వినియోగిస్తుండగా. సుమేర్ సింగ్ మాత్రం వరి దుబ్బులను నేలకు దగ్గరగా కోయించి, వాటిని వరుసల మధ్య పరిచి మల్చింగ్ లా వినియోగిస్తున్నారు. దీంతో నేలలో తేమ ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంటోందని , సాగునీటి కొరతకు పరిష్కారం లభిస్తోందని రైతు తెలిపారు. ఈ పద్ధతిలో ఎకరా పొలం నుంచి 80 క్వింటాళ్ల వరకు ఉల్లి దిగుబడులను పొందుతున్నారు. సాధారణంగా రైతులు ఉల్లి కోత అనంతరం పంటను బస్తాల్లో నింపి నిల్వ చేస్తారు. ఈ పద్ధతిలో బస్తాలో వేడి పెరిగి గడ్డలు కుళ్లిపోతాయి. ఈ సమస్యను అధిగమించేందుకు రైతు తనదైన పరిష్కారాన్ని కనుగొన్నారు. పంటకోత అనంతరం కాడలతో సహా ఉల్లి గడ్డలను కట్టలుగా కట్టి కొట్టంలో తాడుతో వేలాడదీస్తున్నారు.

ఇలా చేయడం వల్ల గడ్డలకు తగినంత గాలి తగిలి కుళ్లిపోవడం తగ్గింది. ఈ పద్ధతిలో కాయలను 3 నుంచి 4 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చునని నాణ్యతపైనా ఎలాంటి ప్రభావం చూపదని రైతు పేర్కొన్నారు. వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేసేందుకు రైతు ఎప్పుడ సిద్ధంగా ఉండాలని వెనకాడవద్దని సూచిస్తున్నారు ఈ రైతు. పద్ధతులు మారితే వచ్చే ప్రతిఫలం రైతుకు సంతృప్తిని అందిస్తుందని చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories