ఒక ఎకరంలోనే 100 రకాల పంటల సాగు చేసే లఖ్ పతి ఖేతి విధానం

Arun Chilukuri
Published on: 14 Feb 2020 5:10 PM IST
ఒక ఎకరంలోనే 100 రకాల పంటల సాగు చేసే లఖ్ పతి ఖేతి విధానం
X
ఒక ఎకరంలోనే 100 రకాల పంటల సాగు చేసే లఖ్ పతి ఖేతి విధానం

ఒక ఎకరంలో సుమారు రెండు, మూడు పంటలు మాత్రమే వేసే రైతులను చూసుంటాం కానీ అక్కడ...కేవలం ఒక్క ఎకరంలోనే 100 రకాల పంటలు సాగు చేస్తుంటారు !! ఏడాది పొడవునా ఒక్క ఎకరంలోనే నిర్విరామంగా పంటల సాగు జరుగుతూనే ఉంటుంది. అంతర, మిశ్రమ పంటలతో సాగు చేసే ఈ విధానాన్ని లక్ పతి ఖేతి గా పిలుస్తారు అక్కడి జనం. మన భాషలో చెప్పాలంటే లక్ష రూపాయల ఆదాయం పొందే వ్యవసాయం అని అర్థం. మహారాష్ట్రలోని కొల్లాపూర్ సిద్దేశ్వర మఠం ఆధ్వర్యంలో చేస్తున్న ఈ లక్ పతి ఖేతి సాగు విధానంపై ప్రత్యేక కథనం.

మహారాష్ట్రలోని కొల్లాపూర్ కృషి విజ్ఞాన కేంద్రం, సిద్దేశ్వర మఠం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఒక ఎకరంలోనే దాదాపు 100 రకాల పంటలను సాగు చేస్తున్నారు. చౌహాన్ క్యూ పద్ధతి వల్ల కలిగే ఉపయోగాలపై రైతులకు విస్తృత ప్రచారం చేసిన డాక్టర్ నారాయణ రెడ్డి రూపొందించిన లక్ పతి ఖేతిగా పిలిచే ఈ పద్ధతి ద్వారా, కుటుంబ అవసరాలకు పోను సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం పొందే ఈ పంట సాగు విధానం గురించి మనమూ తెలుసుకుందాం.

లఖ్ పతి ఖేతి అంటే ఒకే ఒక్క ఎకరంలో దాదాపు 100 రకాల పంటల సమగ్ర వ్యవసాయ పద్ధతిలో పండిస్తూ సంవత్సరానికి లక్ష వరకు ఆదాయం పొందే వ్యవసాయం. ఈ పద్ధతిని కర్ణాటకకు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణుడు ఎల్ నారాయణ రెడ్డి ప్రవేశపెట్టారు. వ్యాపార రంగం నుండి వ్యవసాయం మీద మక్కువతో మొదట సాధారణ రసాయన వ్యవసాయం చేసి ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయంలోని మేలైన పద్ధతులు, సాగులో దేశీ ఆవుల విశిష్టతను తెలుసుకుని సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంలోకి అడుగుపెట్టాడు. పట్టు విడవకుండా అదే పద్ధతిలో సాగు చేస్తూ విజయం సాధించడమే కాకుండా రైతులకు మేలు చేసే చౌహన్ క్యూ వంటి సేంద్రియ పద్ధతులను విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో కొల్హాపూర్ సమీపంలోని కన్నేరి గ్రామంలో గల సిద్దగిరి మఠం ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఒక ఎకరంలో 100 రకాల పంటల సాగు పద్ధతిని ICAR కూడా ఆమోదం తెలిపింది. ఈ పద్ధతిని సిద్దగిరి మఠాతాధిపతి శ్రీ అదృశ్య కాడ సిద్దేశ్వర స్వామి రైతులందరికీ ఆదర్శంగా నిలవాలని లఖ్ పతి ఖేతీని కొనసాగిస్తున్నారు.

మిశ్రమ,అంతర పంటల విధానంలో చేసే ఈ పద్ధతి సాగు ముఖ్య లక్ష్యం కుటుంబ అవసరాలకు మంచి పోషణ ఆహారాన్ని ఇవ్వటంతో పాటు అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడమే అని ప్రకృతి వ్యవసాయ నిపుణులు జిట్టా బాల్ రెడ్డి.

స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక పంటలు, తీగ జాతులు, ఆకు కూరలతో పాటు బోర్డర్ క్రాప్స ని కూడా పండిస్తున్నారు. పొలం చుట్టూ పండ్ల జాతి వృక్షాలు, నత్రజని పెంచే మొక్కలను కూడా పెంచుతున్నారు. అదే విధంగా సాలుకు సాలుకు మధ్య అంతరపంటలలో భాగంగా నేలలో నత్రజని, భూ సారాన్ని పెంచే మొక్కలను సాగు చేస్తున్నారు.

వ్యవసాయం అనేది వ్యాపారమయంగా కాకుండా ముందుగా మన ఇంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని, పోషకారాహారాన్ని పండించుకోవడమని ఆ తర్వాతవచ్చిన దిగుబడులనే రైతులకు ఆదాయంగా మారాలని, అంతే కాకుండా ప్రకృతి విధానంలో ఈ పద్ధతిలో సాగు చేస్తే అటు రైతు కుటుంబాలు, ఇటు సమాజం కూడా బాగుంటుందని అంటున్నారు పర్యవేక్షకుడు తానాజి నిఖమ్


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story