బెంగళూరు పార్కులో విషాద ఘటన

lakshman
Updated on: 24 Dec 2018 12:11 PM IST
బెంగళూరు పార్కులో విషాద ఘటన
X

బెంగళూరు: నగరంలోని బన్నేర్‌ఘట్ట పార్కు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ తెల్లపులి చనిపోయింది. మరో తెల్ల పులి గాయపడింది. ఈ ఘటన రెండు రోజుల క్రితమే జరిగినా పార్కు సిబ్బంది గోప్యంగా ఉంచారు. అయితే ఈ ఘటన జరిగిన రోజు కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను నెట్‌లో పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్రేయాస్ అనే తెల్ల పులి పెద్ద పులులున్న బోనులోకి వెళ్లింది. దానితో పాటు మరో తెల్ల పులి కూడా ఉంది. రెండు పెద్ద పులులు వాటిపై దాడి చేశాయి. ఆ దాడిలో శ్రేయాస్ తీవ్రంగా గాయపడింది. అప్పటికీ దానిపై దాడి చేయబోతున్న పులులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ తీవ్రంగా గాయపడటంతో శ్రేయాస్ ప్రాణాలు కోల్పోయింది.

పర్యాటకులు దాడి చేస్తున్న పులులను తరిమివేసేందుకు కేకలు వేశారు. దీంతో ఆ రెండు పెద్ద పులులు వెనుదిరిగాయి. మిగిలిన తెల్ల పులికి కూడా గాయాలయ్యాయి. తెల్ల పులులకు, బెంగాల్ టైగర్స్‌కు బోన్లు వేరువేరుగా ఉంటాయి. అసలు పెద్ద పులులున్న బోనులోకి తెల్ల పులులు ఎలా వెళ్లాయనే దానిపై పార్క్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ ఆరా తీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రేయాస్ వయసు 9సంవత్సరాలు. ఈ పార్కులో మొత్తం 5 తెల్ల పులులున్నాయని తెలిసింది.

lakshman

lakshman

Next Story