తెలంగాణ ప్రభుత్వానికి చెక్కుల సమస్య

తెలంగాణ ప్రభుత్వానికి చెక్కుల సమస్య
x
Highlights

ఎకరాకు నాలుగువేలు. ప్రతీ రైతుకు అందాల్సిందే. సర్కార్‌ సంకల్పం ఇదే. మంచిదే. పైకం రూపంలో ఇస్తే సరే. మరి చెక్కులుగా ఇస్తే పరిస్థితి ఏంటి. తెలంగాణ...

ఎకరాకు నాలుగువేలు. ప్రతీ రైతుకు అందాల్సిందే. సర్కార్‌ సంకల్పం ఇదే. మంచిదే. పైకం రూపంలో ఇస్తే సరే. మరి చెక్కులుగా ఇస్తే పరిస్థితి ఏంటి. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఇదే సమస్యను ఎదుర్కొంటుంది. ఏకబిగిన కావాల్సిన 70 లక్షల చెక్కులు సాధ్యం కాదంటూ బ్యాంకులు తేల్చిచెప్పడంతో ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలన్న నిశ్చయానికి వచ్చింది

వినియోగదారులకు చెక్కులు కావాలంటే బ్యాంకులో కొన్నింటిని ఉచితంగా ఇస్తారు. అదనంగా కావాలంటే కొంత డబ్బు చెల్లిస్తే ఇస్తారు. అంతేగానీ వాటిని స్వయంగా ముద్రించుకోలేం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. రైతు పెట్టుబడి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకేసారి 70 లక్షల చెక్కులు అవసరమయ్యాయి. అయితే ఒకేసారి అన్ని చెక్కులు సమకూర్చడం తమవల్ల కాదని బ్యాంకులు చేతులెత్తేశాయి.

కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని ఇండెంట్‌ పెట్టి తెప్పించుకోవాలన్న బ్యాంకులు కుండబద్ధలు కొట్టడంతో చెక్కులు కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్రం అనుమతిస్తే చెక్కులను ప్రత్యేకంగా ముద్రిస్తారు. అలా ముద్రించి ఇచ్చిన చెక్కులను రాష్ట్రంలో బ్యాంకులకు అందజేస్తామని వ్యవసాయ శాఖాధికారులు అంటున్నారు. ఆ తర్వాత వాటిపై రైతుల వివరాలను, పెట్టుబడి సాయం సొమ్ము నమోదు చేసి రైతులకు అందజేస్తారు.

రాష్ట్రంలో రైతు పెట్టుబడి పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం చెక్కులను ఇవ్వాలని నిర్ణయించింది. ఖరీఫ్‌ నుంచి అమలు చేసే ఈ పథకం కింద రైతులకు చెక్కులు ఇస్తారు. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో రైతు ఖాతాలు 71.75 లక్షలున్నాయి. ఇలా చూసినా రైతుల సంఖ్య అటుఇటుగా 70 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంతమంది రైతులకు చెక్కులు ఇవ్వాలంటే వాటిని ముద్రించి ఇచ్చేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. వినియోగదారులకు 30 చెక్కులు ఉచితంగా ఇస్తారు. అంతకంటే ఎక్కువ కావాలంటే ఒక్కో చెక్కుకు రెండున్నర నుంచి ఐదు రూపాయల వరకు వసూలు చేస్తారు. ఆ ప్రకారం 70 లక్షల చెక్కులకు 2 కోట్లకు పైనే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రబీ సీజన్‌కు కూడా అప్పటి అవసరాన్ని బట్టి మళ్లీ చెక్కులను ముద్రించుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి 70 లక్షల ముద్రణ సాధ్యమయ్యే పనికాదు. కాబట్టి వినియోగదారులు తమకు చెక్కులు కావాలంటే బ్యాంకులు ఇండెంట్‌ పెట్టి సమయం ఇస్తాయి. ఈ మేరకు ఇన్ని లక్షల చెక్కుల ముద్రణకు కనీసం రెండు నెలల సమయం తీసుకుంటుంది. అంటే ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతి తీసుకొని ముద్రణకు ఆర్డర్‌ ఇస్తే మార్చి వరకు సమయం పడుతుంది. అందుకే చెక్కుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నది సర్కార్‌ నిర్ణయంగా చెబుతున్నారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories