తెలంగాణలో కాంగ్రెస్, టిఆరెస్ మధ్య అసెంబ్లీ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి, సంపత్ కుమార్ ల బహిష్కరణ...
తెలంగాణలో కాంగ్రెస్, టిఆరెస్ మధ్య అసెంబ్లీ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి, సంపత్ కుమార్ ల బహిష్కరణ వివాదంపై రెండు పార్టీలు కోర్టు కెక్కడంతో ఈ వివాదం చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. గతంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు ఊరట నిచ్చేలా ఇచ్చిన తీర్పు టిఆరెస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడిటనట్లయింది.వారి బహిష్కరణ చెల్లనేరదని తక్షణం వారి సస్పెన్షన్ ను ఎత్తేసి వారికి సభ్యత్వ పునరుద్ధరణ కల్పించాలంటూ అప్పట్లో హై కోర్టు తీర్పు నిచ్చింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టిఆరెస్ ఎమ్మెల్యేలు హై కోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఎదుట దాఖలైన వ్యాజ్యంలో ఈ ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదు.. దాంతో వీరు అప్పీల్ దాఖలు చేయాలంటే కోర్టు అనుమతినివ్వాలి..
ఈ నేపధ్యంలో వారు అప్పీల్ దాఖలుకు కోర్టు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏసిజే నేతృత్వంలోని ధర్మాసనం అప్పీల్ దాఖలుకు అనుమతి ఇవ్వాలా లేదా అన్న దానిపై విచారణ ప్రారంభించింది. ఎమ్మెల్యేల తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది వైద్య నాథన్, కోమటి రెడ్డి తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం మాత్రమే ఉన్నందున వారి అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకోవాలని టిఆరెస్ ఎమ్మెల్యేలకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని కాంగ్రెస్ తరపు న్యాయవాది వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని కొట్టేసింది. దీంతో టిఆరెస్ ఎమ్మెల్యేలకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన అన్ని హోదాలను తక్షణం కల్పించాలంటూ తీర్పు ఇచ్చింది. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం వేశారు.
తీర్పును తక్షణం అమలు చేయాలని లేకుంటే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ లో సైలెంట్ వార్ నడుస్తోంది. కోర్టు తీర్పుల నేపధ్యంలో పార్టీ ఇమేజ్ కు మరింత పబ్లిసిటీ కల్పించుకోడంలో సీనియర్లు విఫలమవుతున్నారన్న అసంతృప్తి బహిష్కృత ఎమ్మెల్యేలలో ఉంది.. ఈ అంశాన్ని బాగా ప్రచారం చేసుకోవడంలో పార్టీ ఫెయిల్ అయిందన్నది కోమటిరెడ్డి భావన.. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డికి ఫోన్ చేసి అభినందించారు. కానీ అసెంబ్లీలో విపక్ష నేత జానారెడ్డి సరిగా స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించి, తమను ఎమ్మెల్యేలుగా ప్రభుత్వ వెబ్ సైట్ లో పెట్టకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయనంటున్నారు.
పంచాయతీ రాజ్ యాక్ట్ సమయంలో సభ నుంచి తమను సస్పెండ్ చేయడం వల్ల దానిపై మాట్లాడే అవకాశం రాలేదని, కాబట్టి ఇప్పుడు సభను సమావేశపరచి ఆ అంశంపై చర్చ పెట్టాలని కోరారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో తమ పార్టీ మూకుమ్మడి రాజీనామాలకు సైతం సిద్ధపడుతుందని జానారెడ్డి తెలిపారు.. బహిష్కృత ఎమ్మెల్యేల సభ్యత్వం తక్షణం పునరుద్ధరించి వారికి రక్షణ కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయ బేధాలు అత్యంత సహజమని.. వాటన్నింటినీ అధిగమిస్తామనీ అన్నారు.. గవర్నర్ ప్రసంగం సమయంలో మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ పై హెడ్ ఫోన్ విసిరి గాయపరిచారంటూ ఎమ్మెల్యలేలు కోమటి రెడ్డి, సంపత్ లను సభ నుంచి బహిష్కరిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేసిననాటి నుంచి కాంగ్రెస్, టిఆరెస్ మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలాగే ఉంది.. అయితే ప్రస్తుత పరిస్థితి కాంగ్రెస్ కి మంచి అవకాశం గా మారినా పార్టీ ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కోర్టు తీర్పుతో ఇరకాటంలో పడిన టిఆరెస్ ఏం చేస్తుందన్నది చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire