కొడుకును చూసి వస్తూ అనంతలోకాలకు

nanireddy
Updated on: 24 Dec 2018 2:10 PM IST
కొడుకును చూసి వస్తూ అనంతలోకాలకు
X

గురుకులంలో చదువుతున్న కొడుకును చూసి వస్తూ ఓ వ్యక్తి హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగింది. కోట మండలం లక్ష్మయ్యకండ్రిగ గ్రామానికి చెందిన కె.మాతయ్య (35) ఆదివారం తన భార్యతో కలిసి దొరవారిసత్రంలో ఉన్న గురుకులంలో చదువుతున్న కుమారుడిని చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో తాను తరువాత వస్తానని చెప్పి భార్యను నాయుడుపేట బస్టాండ్‌లో కోట బస్సు ఎక్కించాడు. అనంతరం మాతయ్య ఒక్కడే బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో పండ్లూరు జాతీయ రహదారి కూడలి వద్దకు వచ్చి గుండెనొప్పిగా ఉందని బైక్‌ను రోడ్డు పక్కన నిలిపాడు. కొద్దిసేపటికే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని గమనించిన స్థానికులు 108 సమాచారం అందించారు. కానీ అప్పటికే మాతయ్య మృతిచెందాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story