పీసీసీపై యుద్ధానికి సిద్ధమవుతున్న కోమటిరెడ్డి, సంపత్

x
Highlights

ఆ ఇద్దరు ఏకాకులయ్యారా..? పట్టించుకునే వారు లేక ఒంటరిగా మిగిలారా..? తోడుంటారని అనుకున్న వారంతా.. చేయిచ్చారా..? ఆపదలో ఆపన్న హస్తం ఇవ్వాల్సిన పార్టీ.....

ఆ ఇద్దరు ఏకాకులయ్యారా..? పట్టించుకునే వారు లేక ఒంటరిగా మిగిలారా..? తోడుంటారని అనుకున్న వారంతా.. చేయిచ్చారా..? ఆపదలో ఆపన్న హస్తం ఇవ్వాల్సిన పార్టీ.. పట్టించుకోవడం లేదా..? శాసనసభ్యత్వం రద్దైన తర్వాత కోమటిరెడ్డి, సంపత్ లు ఎందుకు సైలెంట్ అయిపోయారు..? సమస్య తమది కానట్లు.. పార్టీ పెద్దలు వ్యవహరించడంపై వారి వ్యూహం ఏంటి..?

పార్టీ కోసం ప్రశ్నించారు. ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా ప్రతిపక్ష పాత్ర పోషించారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో అతిచేశారు. అదే వారికి శాపంగా మారింది. వారి సభ్యత్వం రద్దైపోయింది. ఘటన జరిగినప్పుడు హడావుడి చేసినా.. తర్వాత విషయం చల్లారిపోయింది. కష్టాల్లో ఉన్నప్పుడు తోడుండాల్సిన పార్టీనాయకులు, సీఎల్పీ సహచరులు కానరాకుండా పోయారు. ప్రస్తుతం ఆ ఇద్దరు ఒంటరిగా మిగిలిపోయారు. శాసనసభ సభ్యత్వం కోల్పోయిన కోమటిరెడ్డి, సంపత్ కుమార్ లు.. ఇప్పుడు ఏకాకులయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.

సభ్యత్వం రద్దు కాగానే.. ఆ ఇద్దరు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో దీక్షకు దిగారు. పార్టీ నాయకులంతా మూకుమ్మడిగా మద్దతు పలికారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పనిలో పనిగా ఈసీకి కూడా కంప్లైంట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే విషయం వీక్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ జరిగినప్పుడు ఉన్న హడావుడి కొన్ని రోజుల్లోనే చల్లారిపోయింది. సభ్యత్వ రద్దు అనేది ప్రజాస్వామ్య స్పూర్తికే మచ్చ అంటూ గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది.

ఏదేమైనా.. కోమటిరెడ్డిని, సంపత్ కుమార్ ను.. ఇటు పార్టీ కానీ.. అటు సీఎల్పీ కానీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీక్ష తర్వాత పార్టీ పెద్దలు మొహం చాటేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ కనీసం బంద్, ధర్నాలకు పిలుపునివ్వకపోవడంపై ఆ ఇద్దరూ మనస్థాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు తోడుగా పార్టీ నుంచి మిగతా ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేస్తారని ముందుగా భావించినా అది కూడా జరగకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ మానాన తమను వదిలేసి పీసీసీ బస్సు యాత్రకు సిద్దం కావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక లాభం లేదనుకున్న కోమటిరెడ్డి, సంపత్ లు ఈ నెల 30 న ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసి తమను పట్టించుకోని పీసీసీపై పరోక్ష యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories