దుర్గ గుడిలో అధికారుల నిర్లక్ష్యం...మహిళలు బట్టలు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు

దుర్గ గుడిలో అధికారుల నిర్లక్ష్యం...మహిళలు బట్టలు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు
x
Highlights

ఇంద్రకీలాద్రిలో అధికారుల నిర్వాకం బయటపడింది. సి.వి.రెడ్డి ఛారిటీస్ ట్రస్టు డార్మిటరీలో మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం...

ఇంద్రకీలాద్రిలో అధికారుల నిర్వాకం బయటపడింది. సి.వి.రెడ్డి ఛారిటీస్ ట్రస్టు డార్మిటరీలో మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. మహిళలు ఉండే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఇటీవల వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తాజాగా దుర్గగుడికి వచ్చే భక్తుల కోసం నిర్మించిన డార్మెటరీల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. దుర్గగుడి తరుపున వన్‌టౌన్‌లోని సీవీ రెడ్డి ఛారిటీస్‌లో ఈ డార్మెటీరీలను నిర్మించారు. ఉచిత డార్మెటరీలతో పాటు ఏసీ డార్మెటరీలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఈ శీతల గదులు ఉన్నాయి. అయితే మహిళల డార్మెటరీల్లో సీసీ కెమెరాలు ఉండటంపై సోమవారం కొందరు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. డార్మెటరీలలో మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ఇబ్బందిగా ఉందని అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

అయితే సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటి నుంచి దృశ్యాలు రికార్డు చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. వీటి నిర్మాణ సమయంలో అన్నిచోట్లా ఏర్పాటు చేసినట్లే అక్కడ కూడా సీసీ కెమేరాలు బిగించామని దేవస్థానం అధికారులు తెలిపారు. డార్మెటరీలను కేవలం విశ్రాంతి కోసమే తప్ప దుస్తులు మార్చుకునేందుకు కాదని ఈవో పద్మ ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే వివాదం గురించి తెలుసుకున్న దుర్గగుడి పాలకమండలి సభ్యుడు ధర్మారావు అక్కడికి చేరుకున్నారు. మహిళల గదుల్లో సీసీ కెమెరాలు అమర్చడం పొరపాటేనని అంగీకరించారు. ఇవాళే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటిని తొలగించడంతో పాటు బాధ్యులపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదిలా ఉంటే... ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటుపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని అధికారుల దృష్టికి కొద్దిరోజుల క్రితమే తీసుకెళ్లామని సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు సీసీ కెమెరాలు రికార్డు చేయడం లేదని అధికారులు చెబుతున్నా కెమెరాల వద్ద లైట్లు వెలుగుతుండటంతో భక్తులకు అనుమానం వచ్చి గొడవకు దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories