పవన్ ను మెచ్చుకున్న చంద్రబాబు
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం జరిగిన టీడీపీ నేతల సమన్వయ కమిటీలో పవన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పవన్ జేఏసీపై స్పందించారు. పవన్ కల్యాణ్ పోరాటంలో అర్థం ఉందని సమావేశంలో పాల్గొన్న నేతలతో సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి మేలు చేయాలనే కాంక్షతో పవన్ ముందుకెళ్తున్నారని సీఎం మెచ్చుకున్నారు.
జనసేనాని జేఏసీతో టీడీపీకి ఎలాంటి ఇబ్బంది రాదని భేటీలో నేతలకు చంద్రబాబు చెప్పారు. శ్వేతపత్రం అడిగితే సున్నితంగా సమాధానం చెప్పాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు. అసలు కేంద్రం ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఏం చేసిందో శ్వేతపత్రం రూపంలో బీజేపీ ప్రకటించాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ సంభాషణ మొత్తం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో జరిగింది. పై వ్యాఖ్యలు సమావేశానికి హాజరైన నేతలతో చంద్రబాబు అన్నారు.


