బెజవాడలో కీచకపర్వం...యువతిపై సామూహిక అత్యాచారం..

బెజవాడలో కీచకపర్వం...యువతిపై సామూహిక అత్యాచారం..
x
Highlights

అమ్మాయిలూ..ఫ్రెండ్ అనో, లవర్‌ అనో నమ్మి వాళ్లతో చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నారా..? పార్టీలకు, షికార్లకు బయటకు వెళ్తున్నారా..? వెళ్లేముందు కొంచెం...

అమ్మాయిలూ..ఫ్రెండ్ అనో, లవర్‌ అనో నమ్మి వాళ్లతో చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నారా..? పార్టీలకు, షికార్లకు బయటకు వెళ్తున్నారా..? వెళ్లేముందు కొంచెం ఆలోచించండి. జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఏం చేసినా లాభం లేదు. సామూహిక లైంగిక దాడులు, ఆపై వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం లాంటి వికృత చేష్టలతో స్నేహితులే నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారు. 2017 ఫిబ్రవరిలో కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో ఓ బీటెక్ విద్యార్థినిని ఆమె స్నేహితులు నమ్మించి మోసం చేశారు. మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

బర్త్‌డే పార్టీ అంటూ పిలిచిన నిందితులు ఆ యువతికి మత్తు పదార్థం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానిక ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న విజయవాడకు చెందిన తోటి విద్యార్థి టి.వంశీకృష్ణ, సీనియర్‌ విద్యార్థి శివారెడ్డిలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. యువకులిద్దరూ ఆగిరిపల్లిలో రూమ్‌ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బర్త్‌డే పార్టీ ఉందంటూ ఆమెను ఓ రోజు వారిద్దరు తమ గదికి పిలిచారు. మత్తుపదార్థం కలిపిన కూల్‌డ్రింక్‌ను ఆమెతో తాగించి, అత్యాచారం జరిపారు. ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. విషయాన్ని బయటకు చెబితే ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది.

కానీ, వారిద్దరు మాత్రం ఊరుకోలేదు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తమ ముఖాలు కనిపించకుండా బ్లర్‌ చేసి ఆమె ముఖం ఒక్కటే కనిపించేలా చేసి వీడియోను తమ స్నేహితుల మొబైళ్లకు పంపించారు. ఆ వీడియోను చూసిన బొద్దనపల్లి గ్రామానికి చెందిన దొడ్ల ప్రవీణ్‌ ఆమెకు ఫోన్‌ చేసి, బెదిరించాడు. పది లక్షలు ఇస్తే సరే, లేదంటే ఆ వీడియోను బయట పెడతానని బేరం పెట్టాడు. కొద్ది కాలం ప్రవీణ్‌ వేధింపులను బాధితురాలు భరించింది. అయినా, అతడు మరింతగా రెచ్చిపోతుండటంతో, చివరకు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పేసింది. వారు ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం దృష్టికి గత మే నెలలో తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచారం జరిపిన విద్యార్థులను యాజమాన్యం పిలిపించి మందలించింది. బాధితురాలి కుటుంబానికి వారితో క్షమాపణ చెప్పించింది. ఇక పై ఆ యువతి జోలికి వెళ్ళబోమని, లిఖితపూర్వక హామీ తీసుకుని, ఆ వీడియోను డిలిట్‌ చేయించింది.

ఆ సమస్య అక్కడితో తీరిపోయిందని బాధితురాలి కుటుంబం ఊరట చెందింది. తమ కుమార్తెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకొని, ఆ ప్రయత్నాల్లో పడింది. ఇంతలోనే కాలేజీ యాజమాన్యం ముందు డిలిట్‌ చేసినట్టు కనిపించిన వీడియో దృశ్యాలు పది రోజులక్రితం తిరిగి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వాటిని చూసి నివ్వెరపోయిన బాధితురాలి తండ్రి ఆగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు కృష్ణవంశీ, శివారెడ్డి, దొడ్ల ప్రవీణ్‌‌ను అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories