Stock Market: దేశీ మార్కెట్ లో కొనసాగిన ఒత్తిడి వాతావరణం

Stock Market: ఆర్థిక పునరుద్ధరణ వేగాన్ని ప్రభావితం చేసే భారత్ *కోవిడ్ సెకండ్ వేవ్ ప్రకంపనలతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనం

Sandeep Eggoju
Published on: 27 March 2021 9:48 AM IST
Continued Stressful Weather in the Domestic Market
X

Representational Image

Stock Market: గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపధ్యంలో మార్చి 26 తో ముగిసిన వారంలో దేశీ మార్కెట్ ఒత్తిడిలో కొనసాగింది, ఆర్థిక పునరుద్ధరణ వేగాన్ని ప్రభావితం చేసే భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రకంపనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసినట్లయింది. తాజా వారంలో బిఎస్ఇ సెన్సెక్స్ 849.74 పాయింట్లు లేదా 1.70 శాతం పడిపోయి 49,008 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 182 పాయింట్లు లేదా 1.6 శాతం మేర క్షీణించి 14,507 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారం తొలి రోజున ప్రతికూల బాటన ట్రేడింగ్ ఆరంభించి నష్టాల్లో ముగించాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 86 పాయింట్ల మేర క్షీణించగా నిఫ్టీ 14,700 మార్కు ఎగువకు చేరాయి..దేశీయంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులకు తోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ తదితర హెవీవెయిట్స్ పేలవ ప్రదర్శన యుఎస్ బాండ్ల దిగుబడులు పెరగడం తదితర అంశాలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి

ఇక వారం మలి రోజున భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్ ఆరంభించి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 280 పాయింట్లు ఎగసి 50,051 వద్దకు చేరగా నిఫ్టీ 78 పాయింట్ల మేర లాభంతో 14,814 వద్ద స్థిరపడ్డాయి.

మూడో సెషన్ కి వచ్చేసరికి దేశీ మార్కెట్లు భారీ నష్టాలను మిగిల్చాయి.సెన్సెక్స్ 871 పాయింట్లు క్షీణించగా నిఫ్టీ 14 వేల 600 మార్క్ దిగువకు చేరింది. నాలుగో సెషన్ లోనూ మార్కెట్లు నష్టాల బాటన నడిచాయి. అంతర్జాతీయ మార్కెట్లు దాదాపు 2 శాతం కుప్పకూలిన నేపధ్యంలో లాక్‌డౌన్‌ ఆందోళనలు ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు నడిపించాయి. అయితే వీకెండ్ సెషన్ కి వచ్చేసరికి మార్కెట్లు బౌన్స్ బ్యాక్ కాగలిగాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో వరుస రెండు రోజుల నష్టాలకు చెక్‌ చెప్పిన కీలక సూచీలు వారాంతంలో పాజిటివ్‌గా ముగిసాయి.ఫలితంగా దేశీ మార్కెట్లో హోలీ కళ ముందే వచ్చినట్టయింది.

వారం ప్రాతిపదికన చూస్తే సెన్సెక్స్‌ 850 పాయింట్లు నిఫ్టీ 237 పాయింట్లు చొప్పున డీలా పడ్డాయి...వారంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 6,280.85 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీలను విక్రయించగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు 4,596.64 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి...మరోవైపు ఫారెక్స్ మార్కెట్ లో డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 11 పైసలు పెరిగి 72.51 వద్ద ముగిసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story