What's wrong with Naidu's strategy: డామిట్‌..బాబు స్ట్రాటజీ అడ్డం తిరిగిందా?

Arun Chilukuri
Published on: 29 July 2020 5:58 PM IST
Whats wrong with Naidus strategy: డామిట్‌..బాబు స్ట్రాటజీ అడ్డం తిరిగిందా?
X

What's wrong with Naidu's strategy: ఆయన ప్రతి స్ట్రాటజీ గోడకు కొట్టిన బంతిలా రివర్స్‌ అవుతోంది. ఏ వ్యూహం వేసినా బెడిసికొడుతోందన్న చర్చ, సొంత పార్టీలోనే జరుగుతోంది. విజనరీ నేతగా గుర్తింపున్న లీడర్‌, విజన్‌ కోల్పోతున్నారా? విజనరీ నేతగా సొంతపార్టీ నేతలు గొప్పగా చెప్పుకునే టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పుడు తన విజన్ ను కోల్పోతున్నారా...? పార్టీకి పునర్వైభవం కల్పించటంలో ఆయన రాంగ్ స్ట్రాటజీని ఎంచుకుంటున్నారా...? వైసీపీ ప్రభుత్వంపై ఎదురుదాడి అనుకుని సొంత పార్టీ భవిష్యత్తుకు స్వయంగా వెన్నుపోటు పొడుస్తున్నారా...? ఇదే అదనుగా సీఎం జగన్, టిడిపి పతనానికి పక్కా ప్లాన్ గీస్తున్నారా..?ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే వాచ్ దిస్ స్టోరీ.

విజన్ అనగానే ఎందుకో అందరికంటే ముందుగా గుర్తొచ్చే పేరు టిడిపి అధినేత చంద్రబాబు. చాలావరకూ తాను నమ్మిందే కరెక్టనుకునే చంద్రబాబు, అప్పుడప్పుడు తప్పులో కాలేస్తుంటారు. ఆరోజుల్లో తనదైన మార్క్ తో అద్బుతాలే చేసినప్పటికీ, ఈ మధ్య కాలంలో ఆయన స్ట్రాటజీ ఏమాత్రం వర్కవుట్ కావటం లేదు. మొన్నటి హయాంలో చుట్టూ ఉన్న కోటరీనే నమ్మి దాన్నే పక్కాగా అమలు చేసిన చంద్రబాబు, గత ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూశారు. అయినప్పటికీ ఆయన తీరులో ఏమాత్రం మార్పులేదన్నది తాజా టాక్. పైగా పార్టీలో ఉన్న పెద్ద తలకాయల్లో కొంతమంది జైళ్లకు, మరికొంతమంది డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లిపోవటంతో, ఏం చెయ్యాలో పాలుపోని చంద్రబాబు, అధికార వైసీపీపై ఎదురుదాడికి కోర్టులను ఎంచుకున్నారు.

దీంతో చంద్రబాబు తన అనుభవాన్ని అప్ డేట్ చేసుకోలేదన్న టాక్ సొంతపార్టీలోనే వినిపిస్తోంది. ఎందుకంటే వైసీపీపై రాజకీయంగా ఎదురుదాడి చేయాలి, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలే తప్ప ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఆచితూచి వ్యహరించటంలో ఫెయిలయ్యామన్నది వారి ఆవేదన. ఇందుకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంపై కోర్టుల్లో కేసులు వేయటమేనని కరాఖండిగా చెబుతున్నారు సదరు నేతలు. లక్షల సంఖ్యలో లబ్ధిదారులు ఉన్నపుడు కోర్టుల్లో కేసులు వేస్తే ఫలితం ఎలా ఉన్నా, డ్యామేజీ మాత్రం మనకేనన్న ఆలోచనతో తెలుగు తమ్ముళ్లున్నారు. ఎందుకిలా జరుగుతోంది...? ఏంటీ స్ట్రాటజీ అనుకునేలోపు ముఖ్యమంత్రి జగన్ ఫ్రంట్ ఫుట్ వేసి టిడిపిని సిక్సర్లు కొడుతున్నారు. ప్రజలకు లబ్ధి కలిగే అంశంలో కోర్టులకు వెళ్లి టిడిపి నేతలు అడ్డుకుంటున్నారన్న భావనను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇవ్వాలని భావిస్తే జరుగుతోన్న ఆలస్యానికి టిడిపియే కారణమని ఆయన ఎదురుదాడి చేస్తున్నారు.

దీంతో జగన్ స్ట్రాటజీకి, తమ నాయకుడి స్ట్రాటజీకి ఎంత తేడా ఉందోనన్న చర్చ టిడిపి నేతల్లో జరుగుతోంది. ముఖ్యమంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు ప్రజల్లో తమ పార్టీపై ఉన్న నమ్మకాన్ని మరింత పలుచన చేస్తుందని వారంతా బలంగా నమ్ముతున్నారు. కరోనా నేపథ్యంలో టిడిపి నేతలు పెద్దగా ఎవరూ కలవకపోయినా ఈ అంశంపై వీడియో కాల్స్ చేసుకుని మరీ ఒకరికొకరు బావురుమంటున్నారట. రాజకీయాల్లో పట్టువిడుపులు లేకపోతే ఓటమి ముడుపులు కంటిన్యూ అవుతాయని వారు భావిస్తున్నారు. సో పేదోడి ఇంటి జోలికి వెళ్లి సొంతింటికి టిడిపి నిప్పుపెట్టుకుంటోందా అన్న చర్చ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story