Guntur Mayor: గుంటూరు కార్పొరేషన్‌పై టీడీపీ ఫోకస్.. మేయర్ పదవి దక్కించుకునేందుకు పావులు..

Guntur Mayor: ఏపీలో ప్రభుత్వం మారడంతో నగరపాలక, పురపాలక సంస్థలపై టీడీపీ ఫోకస్ పెట్టింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Jun 2024 12:34 PM IST
TDP Starts Plan to Take Over Mayor Post of Guntur Corporation
X

Guntur Mayor: గుంటూరు కార్పొరేషన్‌పై టీడీపీ ఫోకస్.. మేయర్ పదవి దక్కించుకునేందుకు పావులు..

Guntur Mayor: ఏపీలో ప్రభుత్వం మారడంతో నగరపాలక, పురపాలక సంస్థలపై టీడీపీ ఫోకస్ పెట్టింది. వైసీపీ చేతుల్లో ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. గుంటూరు కార్పొరేషన్‌‌పై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇక్కడ 58మంది కార్పొరేటర్లు ఉండగా టీడీపికి 9మంది, జనసేనకు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. 47మంది వైసీపీకి చెందిన వారే ఉన్నారు. మూడేళ్ల క్రితమే మేయర్‌తో పాటు రెండు డిప్యూటీ మేయర్ పదవులను వైసీపీ చేజిక్కించుకుంది.

కార్పొరేషన్ మేయర్ ‌ను దించాలనే యోచనలో టీడీపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మేయర్‌గా వైసీపీ నేత కావేటి మనోహర్ నాయుడు ఉన్నారు. కావటిపై సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. కావటి మేయర్‌గా ఉండగానే చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ఛాన్స్ ఇచ్చింది. ఆయన అక్కడి నుంచి పోటి చేసి ఓడిపోయారు. దీంతో కావటి కార్పొరేటర్లపై అజమాయిషీ తగ్గింది. ఎన్నికలకు ముందే 8మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో డిప్యూటీ మేయర్ సజీలా కూడా ఉన్నారు. దీంతో టీడీపీ బలం జనసేనతో కలిపి 19కి చేరింది. మరో 10మంది కార్పొరేటర్లు మద్దతు సాధిస్తే టీడీపీకే మేయర్ పీఠం దక్కనుంది. వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేసే పనిలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.

మేయర్‌పై మొదటి నుండి తూర్పు నియోజకవర్గంలోని కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారు. మేయర్ కావటి, మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా మద్య అసలు పొసగలేదు. దీంతో ముస్తాఫా అనుచరులుగా ఉన్న కార్పొరేటర్లు కావటికి మద్దతు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో టీడీపీ మేయర్ సులభంగానే మేయర్ పదవి దక్కించుకుంటుందన్న వాదన వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ముస్తాఫా కూడా ఓడిపోయారు. అతని వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఇప్పుడు ముస్తాఫా మాట విని పరిస్థితి ఉండదని టీడీపీ భావిస్తోంది. దీంతో 10మంది కార్పొరేటర్లను తమవైపు తిప్పుకుని అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తోంది.

టీడీపీ నేత కోవెలమూడి నాని మేయర్ పదవిపై కన్నేసినట్లు చర్చ జరుగుతోంది. అమరావతి రాజధాని పనులు ముమ్మరంగా మొదలవడంతో గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయంటున్నారు. మేయర్ స్థానంలో తమ పార్టీ అభ్యర్థి ఉంటేనే అనుకున్న అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. దీంతో అందరూ కలిసి అవిశ్వాసం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదట్లో కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ లోపుగానే కార్పొరేటర్లతో మంతనాలు జరిపి తమవైపు తిప్పుకునేందుకు ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారు. కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాస తీర్మానంపై తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story