Vangalapudi Anitha Fires on AP Govt: ఏపీలో రేషన్ సరుకుల ధరలు పెంపు.. జనాన్ని దోచుకుంటున్నారని టీడీపీ ఫైర్

Vangalapudi Anitha Fires on AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది.

Samba Siva Rao
Published on: 28 Jun 2020 5:00 PM IST
Vangalapudi Anitha Fires on AP Govt: ఏపీలో రేషన్ సరుకుల ధరలు పెంపు.. జనాన్ని దోచుకుంటున్నారని టీడీపీ ఫైర్
X

Vangalapudi Anitha Fires on AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే సరుకుల ధరల్ని పెంచింది. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే పంచదార, కందిపప్పు ధ‌ర‌లను పెంచింది. సాధారణ తెల్ల రేషన్ కార్డుదారులకు ఇక‌పై పెరిగిన ధ‌ర‌లకే సరుకులు వస్తాయి. అంటే ఇప్పటివరకూ రూ.40 ఉన్న కందిపప్పు రేటును ప్రభుత్వం... రూ.67కి పెంచింది. అలాగే అర కేజీ పంచదార ధరను రూ.10 నుంచి రూ.17కి పెంచింది ప్రభుత్వం. అంత్యోద‌య అన్న యోజన కార్డుదారులకు మాత్రం పంచదార ధర ఇదివరకటిలాగే ఉంటుంది. ఏది ఏమైనా... ఇప్పుడు ఎవరైనా కేజీ కందిపప్పు, కేజీ పంచదార కావాలని అనుకుంటే... వారికి... అదనంగా అయ్యే ఖర్చు రూ.34. ఇది పేదలకు ఇబ్బందికరమే అంటున్నారు నిపుణులు.

ఒకప్పుడు ఇంటికి కావాల్సిన సరుకులన్నీ రేషన్ కార్డుల ద్వారానే అందించేవారు. గోధుములు, కందిపప్పు, పంచదార, కిరోసిన్, శనగపప్పు, బియ్యం, వంట నూనె ఇలా దాదాపు 9 నుంచి 10 రకాల సరుకుల్ని రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వాలు అందించేవి. కానీ రాను రాను వీటి సంఖ్యను తగ్గించేస్తున్నాయి. ఇప్పుడు కరోనా కారణంగా లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా బియ్యం, కందిపప్పు లాంటి రేషన్ సరుకులు ఇస్తోంది.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ధరలను పెంచడం అనేది పేదలకు ఆర్థిక భారమే అని నిపుణులు అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా అనేకమంది రేషన్ కార్డుల లబ్ధిదారులు మధ్యతరగతి ప్రజలు సైతం తమ ఉపాధిని కోల్పోయారు. జగన్ సర్కార్ ఇలాంటి సమయంలో రేషన్ సరుకుల ధరలు పెంపు నిర్ణయం ప్రజలకు మరింత భారం అవుతుంది.

దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. టీడీపీ నేత వంగలపూడి అనిత స్పందించారు. జగన్ సర్కార్ రేషన్ సరుకుల ధరలు పెంచేసి పేదలను దోచుకుంటోందని మండిపడ్డారు. పనికిమాలిన నిబంధనలతో ప్రభుత్వం దాదాపు 19 లక్షల రేషన్ కార్డుల్ని తొలగించి పేదలకు రేషన్ సరుకులు అందకుండా చేశారని అనిత ఫైర్ అయ్యారు. ప్రభుత్వం బియ్యం, పంచదార, కందిపప్పు మాత్రమే ఇస్తోందని, తాజాగా తెల్లరేషన్ కార్డుదారులకు అందించే సరకుల ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజల్ని మోసం చేస్తోందని అనిత మండిపడ్డారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story