Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనుల్లో కదలిక

Polavaram Project: పనుల పరిశీలనకు అంతర్జాతీయ నిపుణుల బృందం రాక

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Jun 2024 1:26 PM IST
Polavaram Project Works Starts In Future
X

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనుల్లో కదలిక

Polavaram Project: సీఎం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన వారం రోజుల్లోనే ప్రాజెక్టులో కదలిక వచ్చింది. సీఎం ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఢిల్లీలో ఈ విషయంపై అవసరమైన తతంగం పూర్తి చేశారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పందించి అడుగులు వేశాయి. అందులో భాగంగా పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను పంపుతున్నారు. అమెరికా, కెనడాకు ఆ చెందిన నలుగురు డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్‌ ఇంజినీరింగ్, హైడ్రాలిక్‌ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో నిపుణులను ఎంపిక చేసి... పోలవరం పంపించనున్నారు.

వీరు జూన్‌ 27 నుంచి జులై 5 వరకు పోలవరంలోనే మకాం వేసి ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక సమర్పిస్తారు. ఈ నిపుణులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ నియమించింది. వీరు మూడు నెలలకోసారి పోలవరం సందర్శిస్తారు. నిర్మాణం పూర్తయ్యేవరకూ సాంకేతికంగా అండదండలు అందించనున్నారు.

కేంద్రం... పంపించిన నలుగురు నిపుణుల బృందంలో ఇద్దరు అమెరికా వాళ్లు కాగా... మరో ఇద్దరు కెనడాకు చెందినవారు. అమెరికాకు చెందిన డేవిబ్ బి.పాల్ డ్యాం భద్రత, మౌలిక వసతుల నిర్వహణలో 35 ఏళ్ల అనుభవం ఉంది. అంతర్జాతీయ డ్యాం భద్రతా సంస్థలో సీనియర్‌ కన్సల్టెంట్‌గా ఉన్నారు. ఫ్లోరిడాకు చెందిన గియాస్ ఫ్రాంకో డిసిస్కో పెద్ద డ్యాంల నిర్మాణం, నిర్వహణ, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌లో 28 సంవత్సరాల అనుభవం ఉంది. అడ్వాన్స్‌డ్‌ స్ట్రక్చరల్‌ సొల్యూషన్స్‌లో చీఫ్‌ ఇంజినీరుగా నైపుణ్యం సాధించారు. కెనడాకు చెందిన రిచర్డ్ డొన్నెల్లీ సివిల్‌ ఇంజినీరింగ్, ప్రధానంగా హైడ్రాలిక్‌ నిర్మాణాలు, నీటివనరుల నిర్వహణలో 30 ఏళ్ల అనుభవం ఉంది. కెనడాకే చెందిన మరో నిపుణుడు సీస్ హించ్‌బెర్గర్ జియోటెక్నికల్‌ ఇంజినీరింగ్, నీటిపారుదల నిర్వహణలో 25 ఏళ్ల అనుభవం ఉంది. అంతర్జాతీయ జియోటెక్నికల్‌ కన్సల్టెంట్‌‌గా ఉన్నారు.

ఎగువ కాఫర్‌ డ్యాంలో అధిక సీపేజీ వస్తోంది. అదే ప్రాజెక్ట్ భవితవ్యానికి సవాలుగా ఉంది. ఫలితంగా ఆ కట్టడం ఆధారంగా చేసుకునే పనులకు అవాంతరం ఏర్పడుతోంది. ఇప్పటి వరకు దీన్ని అధ్యయనం చేసిన వారు ఇక్కడ రసాయనిక గ్రౌటింగ్‌ చేయాలని సిఫార్సు చేశారు. ఫిజోమీటర్లు ఏర్పాటుచేసి నిరంతరం సీపేజీని అంచనా వేయాలని పేర్కొన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు ఈ అంశాలు పరిశీలించి పరిష్కారం సిఫార్సు చేయాలి.

ప్రధాన డ్యాంలో భాగంగా గోదావరి నదీగర్భంలో కట్‌ ఆఫ్‌ వాల్‌గా నిర్మించిన డయాఫ్రం వాల్‌ ఎంతో కీలకం. 2020 భారీ వరదల్లో ఇది ధ్వంసమయింది. దీనికి మరమ్మతులా, కొత్తగా మళ్లీ నిర్మించాలా అన్నది వీరు తేల్చాల్సి ఉంది. ప్రధాన డ్యాం నిర్మించేచోట ఉన్న ఈ సవాళ్లను పరిష్కరించాల్సి ఉంది. వైబ్రో కాంపాక్షన్, వైబ్రో స్టోన్‌కాలమ్‌ల ఏర్పాటు అంశాన్ని సమీక్షించి తక్కువ ఖర్చుతో పరిష్కార మార్గాలను చూపాలి. ఇవి ప్రస్తుతం ఈ నలుుగురు నిపుణుల ముందు ఉన్న సవాళ్లుగా తెలుస్తుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story