Farmers Facing Problems: కర్నూలు జిల్లా రైతులను వెంటాడుతున్న కష్టాలు

Arun Chilukuri
Published on: 8 Aug 2020 3:51 PM IST
Farmers Facing Problems: కర్నూలు జిల్లా రైతులను వెంటాడుతున్న కష్టాలు
X
representative image

Farmers Facing Problems: రాయలసీమ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది కరువు. అయితే రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు ఇప్పుడు కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. ఈ కరువును నివారించేందుకు ఆనాటి పాలకులు కర్నూలుకు ఆ ప్రాజెక్టును వరంగా అందించారు. అయితే ఆ ప్రాజెక్టు కన్నీళ్లు తుడుస్తుంది అనుకుంటే దాహార్తి తీరుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. నాలుగు గింజలు పండించుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తమ పూర్వీకులు బంగారం పండే నల్లరేగడి, ఎర్రరేగడి పొలాలను ఆస్తులుగా ఇచ్చి వెళ్లినా, పరిస్థితుల ప్రభావంతో వాటిని సాగుచేసేందుకు నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. సంవత్సరమంతా కళ్లల్లో వత్తులు వేసుకొని వాన కోసం ఎదురు చూడటం వాన దేవుడు కరుణిస్తే రెక్కల కష్టంతో కాసిన్ని గింజలు పండించుకొని పొట్టపోసుకోవడం ఈ ప్రాంత వాసులకు అలవాటైపోయింది.

రైతులను ఆదుకునేందుకు నిర్మించిన సంజీవయ్య ప్రాజెక్టు వారి కన్నీళ్లు తూర్చలేక పోతోంది. నిర్వహణ లోపం వల్ల కేవలం 10 నుంచి 15 వేల ఎకరాలకు మాత్రమే అధికారులు నీరు అందించగలిగారు. మరోవైపు ఈ ప్రాజెక్టు కింద పంటలు పండించే రైతులకు రబీపంటకు మాత్రమే అంధికారులు నీరు అందిస్తారు. దీంతో రైతులు భూమిలో బోర్లు భించుకొని పంటలు పండించుకుంటున్నారు. ముందు చూపులేని పాలకులు, అధికారుల అలసత్వంతో సాగు నీటి ప్రాజెక్టుగా రూపాంతరం చెందిన సంజీవయ్య సాగర్‌ని తాగు నీటి ప్రాజెక్టుగా మార్చేశారు. కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధితోపాటు, పత్తికొండ, డోన్‌ నియోజకవర్గంలో ఉన్న అనేక ప్రాంతాలకు గాజులదిన్నె ప్రాజెక్టు నుండే నీటిని తరలిస్తున్నారు.

మరోవైపు ప్రతి సంవత్సరం వరదలతో అటు తుంగభద్ర, ఇటు హంద్రీ నుంచి నీరు వృధాగా పోతున్న పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గుండ్రేవుల లాంటి ప్రాజెక్టులకు గ్రహణం ఎప్పుడు వీడుతుందోనని కళ్ళల్లో వత్తులు వేసుకొని రైతులు ఆశగా ఎదురు చేస్తున్నారు. ప్రాజెక్టులు పూర్తయితే ఒక్క కర్నూలు జిల్లాకే కాకుండా రాయలసీ అంతా సాగునీటితో పాటు తాగునీరు అందించవచ్చని అన్నదాతల వాదన. అధికారులు తమ ఇబ్బందులు గుర్తించి ఆ నాటి పాలకులు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు లక్ష్యాన్ని నేరవేర్చాలని గాజులదిన్నే ప్రాజెక్టు కింద ఉన్న రైతులు కోరుతున్నారు. మొత్తంగా ప్రభుత్వాలు, పాలకులు మారినా తమ జీవితంలో ఎటువంటి మార్పులు లేకపోవడంతో కర్నూలు రైతులు కష్టాలతో సహజీవనం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రాజెక్టుల నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని కోరుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story