జనసేన గూటికి విజయసాయి రెడ్డి.. ఆ పోస్ట్ కు అర్థం అదేనా.. ?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులూ ఉండరనేది జగమెరిగిన సత్యం. నిన్నటి వరకు కలిసిమెలిసి తిరిగిన నేతలు.. రాత్రికి రాత్రే బద్ధ శత్రువులయిపోతారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Dec 2024 1:10 PM IST
Vijayasai Reddy Ready To Join Janasena
X

జనసేన గూటికి విజయసాయి రెడ్డి.. ఆ పోస్ట్ కు అర్థం అదేనా.. ?

Vijayasai Reddy Tweet on Pawan Kalyan: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులూ ఉండరనేది జగమెరిగిన సత్యం. నిన్నటి వరకు కలిసిమెలిసి తిరిగిన నేతలు.. రాత్రికి రాత్రే బద్ధ శత్రువులయిపోతారు. అలాగే నిన్నటి దాక విమర్శల వర్షం కురిపించిన నేతలు ఇవాళ చెట్టా పట్టా లేసుకుని కనిపిస్తారు. ఏపీలో ప్రస్తుతం ఇదే సీన్ కనిపిస్తోంది. ఎన్నికల ముందు వరకు పవన్ కల్యాణ్‌ను అనరాని మాటలన్న వైసీపీ నేతలు ఇప్పుడు మాత్రం ఏకంగా సీఎం పదవిలో చూడాలని ఉందంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటనేది ఏపీలో హాట్ టాపిక్.

ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అంతా పవన్ నామస్మరణ జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఇప్పుడు ప్రతిపక్ష నేతలు సైతం పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. విజయసాయిరెడ్డి లాంటి సీనియర్ నేతలైతే పవన్‌ను సీఎం కుర్చీలో చూడాలనుందంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు వరకు పవన్‌పై ఒంటికాలిపై లేచిన నేతలు ఇప్పుడు జయహో పవన్ అనడం విడ్డూరంగా కనిపిస్తుంది.

మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని భార్యలను మారుస్తాడని ముఖానికి రంగులేసుకుంటాడని పూనకం వచ్చినట్టు ఊగిపోతాడంటూ కామెంట్లు చేసిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి... ఇప్పుడు అదే పవన్ కల్యాణ్ సీఎం కుర్చీలో కూర్చుంటే బాగుంటుందంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వెనుక పెద్ద గేమ్ ప్లాన్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పవన్‌పై విమర్శలు చేశారు. కానీ ఎన్నికల ముందు మాత్రం పవన్ సీఎం అయితే బాగుంటుందని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి. అప్పట్లోనే బాలినేని జనసేనలో చేరుతారనే ప్రచారం జోరుగా జరిగింది. సీన్ కట్ చేస్తే ఎన్నికల తర్వాత బాలినేని జనసేనలో చేరారు.

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఎన్నికల ముందు జనసేనలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఇప్పుడు ఆమంచి కూడా పవన్ సీఎం అయితే బాగుంటుందని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఓటింగ్ శాతం సింగిల్ డిజిట్ దాటడం ఇప్పట్లో చాలా కష్టం. అందుకే ఆమంచి కూడా తన రాజకీయ భవిష్యత్ కోసం జనసేనలో చేరేందుకు ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

అయితే విజయసాయిరెడ్డి పోస్ట్ మాత్రం కూటమిలో విబేధాలు సృష్టించేందుకని టీడీపీ, జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య విబేధాలు రావాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని... కానీ అది అసాధ్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.... చంద్రబాబు సీఎం అని పవన్ స్వయంగా చెప్పిన మాటలను కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు.

విజయ్ సాయి రెడ్డి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని పోస్ట్‌ను బట్టి చూస్తే ఆయన కూడా వైసీపీ గూటికి చిన్నగా జారుకునే విధంగా కనపడుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. విజయసాయి రెడ్డిపై కుటమి ప్రభుత్వంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు.. ఆధారాలతో బయటపడుతున్న కొద్దీ.. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆయన తన సంస్థలను కాపాడుకునేందుకు పవన్ కళ్యాణ్‌పై లేని ప్రేమను కురిపిస్తున్నట్లు పవన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనే పోస్టులు పెడుతున్నారని, ఓ పక్క వైసీపీలో నెంబర్ 2 లో స్థాయిలో ఉన్న విజయ్సాయి రెడ్డి.. ఒక పార్టీలో ఉండి మరో పార్టీలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందనే పోస్టులు పెట్టడాన్ని బట్టి చూస్తే విజయసాయి రెడ్డి అవసరం అవకాశాన్ని బట్టి పార్టీలు మారినా ఆశ్చర్యం లేదని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story