ఏపీలో కరోనా వ్యాక్సినేషన్‌ రెండో దశ కార్యక్రమానికి సర్వం సిద్ధం

Sandeep Eggoju
Updated on: 17 Aug 2021 12:46 PM IST
Everything is ready for the second phase of corona vaccination in AP
X

Representational Image

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్‌ రెండో దశ కార్యక్రమానికి సర్వం సిద్ధమయ్యింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. తొలి విడతలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఈసారి వ్యాక్సినేషన్‌లో పంచాయతీరాజ్‌, మున్సిపల్, రెవెన్యూశాఖల్లోని పారిశుద్ధ్య సిబ్బందికి టీకాలు వేయనున్నారు. 2వ విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 89వేల 100 మంది పోలీస్‌ సిబ్బంది, లక్షా 55 వేల మంది మున్సిపల్‌, 3 లక్షల 32వేల మంది రెవెన్యూ సిబ్బంది పేర్లు కోవిన్‌ యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 లక్షల 31వేల కొవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచారు.

రెండో విడత వ్యాక్సిన్ పంపిణీ కోసం కోవిన్‌ యాప్‌లో 5.9 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. మొదటి విడతలో 3.88 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా కేవలం లక్షా 89 వేల మందికే ఇవ్వగలిగారు. రెండో విడతలో ఈ సంఖ్యను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. రెండో విడత వ్యాక్సినేషన్ కోసం 3వేల181 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్‌ తీసుకునే విషయంలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిలో కొన్ని సందేహాలు ఉన్నాయని, అందుకే వ్యాక్సిన్లు వేయడంలో జాప్యం జరుగుతోందన్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నాక తలెత్తుతున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి కేసు వారీగా అవసరమైన చర్యలు తీసుకుంటోందన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story