అతి తీవ్ర తుఫాన్‌గా ఉంఫాన్.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు

అతి తీవ్ర తుఫాన్‌గా ఉంఫాన్.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు
x
Highlights

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెనుతుపాను ఉంఫాన్ తీవ్రతకు తీరం అల్లకల్లోలంగా తయారైంది. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది. మంగళవారం...

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెనుతుపాను ఉంఫాన్ తీవ్రతకు తీరం అల్లకల్లోలంగా తయారైంది. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది. మంగళవారం సాయంత్రానికి ఇది ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 360 కిలోమీటర్లు, పశ్చిమబెంగాల్‌లోని డిగాకు దక్షిణ నైరుతి దిశగా 510 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర ఈశాన్యదిశగా వాయవ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి ఉత్తర బెంగాల్‌-బంగ్లాదేశ్‌ తీరాల మధ్య డిగా, హతియా దీవుల మధ్య సుందర్‌బన్‌కు దగ్గర్లో బుధవారం తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

తీరం దాటే సమయానికి 155 నుంచి 165 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయి. పెను తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తరాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. దక్షిణకోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

రెండు దశాబ్దాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతిపెద్ద 'సూపర్‌ సైక్లోన్‌'గా ఉంఫాన్ ను నిపుణులు అభివర్ణిస్తున్నారు. పెనుతుపాను వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గంటకు 210-240 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోని సముద్ర తీరం వెంబడి గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఈ నెల 20 వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం సూచించింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కృష్ణపట్నంలో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. భీమిలి, తిమ్మాపురం, మంగమర్రిపేట, జాలరిపేటలో సముద్రం ముందుకు వచ్చింది.

ఒడిశాలోని పలు ప్రాంతాలతో పాటు పశ్చిమబెంగాల్‌లోనూ గాలుల తీవ్రత కనిపిస్తోంది. తుపాను తీరం దాటే సమయంలో ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మంగళవారం పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమబెంగాల్‌లో ఇప్పటికే 3 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించగా, మొత్తం 11 లక్షల మందిని తరలించాల్సి ఉన్నట్లు భావిస్తున్నారు.

ఉంఫాన్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా తీరప్రాంత మండలాల్లో గాలుల ఉధృతి ఎక్కువగా ఉంది. సముద్రంలో అలల తీవ్రత పెరిగింది. సోంపేటలోని బారువతీరంతో పాటు పలుచోట్ల సముద్రం 300 అడుగుల ముందుకు వచ్చింది. హిరమండలంలోని వంశధారలో మంగళవారం వరదనీటి ప్రవాహం పెరిగింది. గొట్టాబ్యారేజీ వద్ద గర్భంలో ఉన్న నీటిని 7 గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడిచిపెట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories