Geethanjali Incident: గీతాంజలి ఉదంతంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన

Geethanjali Incident: ట్రోల్స్‌తో విసుగుచెంది ఆత్మహత్యాయత్నం చేసుకున్న గీతాంజలి

Shashank Gullapelli
Published on: 12 March 2024 9:39 PM IST
CM Jagan shock over Geetanjali incident, Rs 20 lakh ex gratia announcement
X

Geethanjali Incident : గీతాంజలి ఉదంతంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన

Geethanjali Incident: సొంత ఇల్లు నాకల.. ఈ రోజుతో నెరవేరిందంటూ కళ్లల్లో వెలుగులతో... గుండె నిండా సంతోషంతో మాట్లాడిన గీతాంజలి అనే మహిళ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇల్లు వస్తుందని అనుకోలేదని, స్టేజ్ మీద పట్టా తీసుకుంటానని అస్సలు అనుకోలేదంటూ గీతాంజలి సంబరపడిపోయారు. ఆ సంతోషంలో ఓ ఛానెల్‌తో ఆమె మాట్లాడిన మాటలు కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆమె చనిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. గీతాంజలి ఎందుకు సూసైడ్ చేసుకున్నట్లు.. కారకులు ఎవరు...? అసలేం జరిగింది..?

సోషల్ మీడియా ట్రోల్స్‌కి మరో మహిళ బలైంది. జగన్ తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి సైతం వస్తోందని పట్టలేని సంతోషంతో గీతాంజలి అనే మహిళ ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియో కాస్త సోషల్ మీడియా ట్రోలర్స్ చేతిలో పడటంతో అనుచిత వ్యాఖ్యలు పెట్టి పోస్టులు చేశారు. సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక పోయిన గీతాంజలి రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసింది. 2 రోజుల పాటు ఆసుపత్రిలో మరణంతో పోరాడి మృతిచెందింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని JusticeForGeethanjali అనే యాష్ ట్యాగ్‌లతో ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

సొంత ఇల్లు తన కల అని... ఇన్ని రోజులకు నెరవేరిందని గీతాంజలి సంతోషం వ్యక్తం చేసింది. డబ్బులు కట్టకుండానే తనకు ఇంటి స్థలం వచ్చిందని... అమ్మ ఒడి వస్తోందని పట్టరాని సంతోషంతో ఓ మీడియా ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఐదేళ్లుగా అమ్మ ఒడి డబ్బులు పడుతున్నాయని చెప్పింది. గీతాంజలి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె సంతోషంగా చెప్పిన మాటలు గంటల్లోనే నెట్టింట వైరల్‌గా మారాయి.

అమ్మ ఒడి ప్రారంభించే నాలుగేళ్లు అవుతుంది... ఐదేళ్లుగా ఎలా డబ్బులు వచ్చాయని ట్రోల్స్ చేశారు. ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మానసికంగా హింసించి.. చివరకు ఆమె మరణానికి కారణమయ్యారు. ట్రోల్స్ కారణంగా తీవ్ర వేదనకు గురైన గీతాంజలి... రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రెండ్రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. గీతాంజలి మృతితో ఆమె కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. ప్రస్తుతం గీతాంజలి మరణం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది.

గీతాంజలి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పెషల్ సెక్రటరీ హరికృష్ణ వెల్లడించారు. గీతాంజలి విషాద ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఘటనపై చలించిపోయిన ముఖ్యమంత్రి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండాలని ఆదేశించారంటూ సీఎం ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ ట్వీట్ చేశారు.

ప్రతి మహిళ బాధపడే విధంగా గీతాంజలి తవ జీవితాన్ని చాలించిందని ఏపీ మంత్రి రోజా అన్నారు. గీతాంజలి మరణం బాధాకరమన్నారు. గీతాంజలి మృతి కారకులైన వారిని కఠఛినంగా శిక్షించాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్దించినట్టు చెప్పారు. తనకు వచ్చిన ఇంటి పట్టాను ఆనందంగా చూపించడమే గీతాంజలి చేసిన తప్పు పనా అని ప్రశ్నించారు. మహిలళను చులకనగా చూసే జనసేన, టీడీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలన్నారామె.

గీతాంజలి సూసైడ్ వ్యవహారంలో టీడీపీ, జనసేన సోషల్ మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి మంత్రి విడదల రజిని. ప్రభుత్వం మంచి పని చేసిందని ఒక సాధారణ మహిళ ఆనందం వ్యక్తం చేస్తే ఆ సంతోషాన్ని నాలుగు రోజులు కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకి మోసం చేయడమే తెలుసు, మంచి చేయడం తెలియదన్న ఆమె.. సీఎం వైఎస్‌ జగన్ మంచి చేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నాడని విమర్శించారు. చనిపోయిన తర్వాత సైతం గీతాంజలిని విడిచిపెట్టలేదని ఆక్షేపించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story