Raghurama Krishnam Raju: విచారణలో కీలక అంశాలను రాబట్టిన సీఐడీ అధికారులు

Raghurama Krishnam Raju: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అధికారులు అర్ధరాత్రి వరకు విచారించారు

Arun Chilukuri
Updated on: 15 May 2021 11:55 AM IST
CID Officers get a Key Points From MP Raghu Rama Krishna Raju
X

వైసీపీ ఎంపీ రఘు రామ (ఫైల్ ఇమేజ్)

Raghurama Krishnam Raju: నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు సీఐడీ ఆఫీస్‌కు తరలించారు. అర్థరాత్రి వరకు సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ విచారించారు. అనంతరం రాత్రి సీఐడీ కార్యాలయంలోనే రఘురామకృష్ణరాజుకి వైద్య పరీక్షలు నిర్వహించారు. సామాజిక వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వంలోని వివిధ హోదాలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకున్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా ఎందుకు అనుచిత వ్యాఖ్యాలు చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణలో సీఐడీ అధికారులు కీలక అంశాలను రాబట్టినట్టు తెలుస్తోంది. రఘురామ వాగ్ముంలాన్ని రికార్డు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కేసును విచారిస్తున్నారు.

మరోవైపు గుంటూరు సీఐడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు, బారీగేట్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయమైన ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశాడని ఐసీపీ సెక్షన్ 124 ఏ కింద కేసు నమోదు చేశారు. దాంతో పాటు ఆయనపై ఐపీసీ 123A, 153A, 505R&W, 120B సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేయడంపై హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. నిబంధనల ప్రకారం ఎంపీని అరెస్టు చేయలేదని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. విచారణ పూర్తయ్యే వరకు మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచవద్దని సీఐడీ అధికారుల కస్టడీలో ఉన్న రఘురామకృష్ణరాజుకు వైద్య సదుపాయాలు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఇవాళ ఉదయం 10 గంటలకు విచారించనుంది ధర్మాసనం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story