మూడు రాజధానులపై ప్రభుత్వం మాట నెగ్గించుకుంది. అనుకున్నట్టుగానే ఎన్నో ఇబ్బందుల మధ్య ఎట్టకేలకు ఈ సమావేశాల్లో బిల్లును ఆమోదింపజేసుకుంది.
మూడు రాజధానులపై ప్రభుత్వం మాట నెగ్గించుకుంది. అనుకున్నట్టుగానే ఎన్నో ఇబ్బందుల మధ్య ఎట్టకేలకు ఈ సమావేశాల్లో బిల్లును ఆమోదింపజేసుకుంది. ఈ తరుణంలో ఇక పరిపాలనా వ్యవహారమంతా విశాఖ తరలి వెళ్లనుంది. చరిత్రాత్మక బిల్లులను శాసనసభ మంగళవారం ఆమోదించింది. 'పరిపాలన వికేంద్రీకరణ – ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020', 'సీఆర్డీఏ చట్టం–2014 రద్దు బి'లను శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మార్గం సుగమమైంది.
పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఈ బిల్లులను ప్రభుత్వం రూపొందించింది. ఆ ప్రకారం పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించింది. గత సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లులను శాసనసభ ఆమోదించి మండలికి పంపింది. ఈ బిల్లులను శాసనమండలిలో అడ్డుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ విఫలయత్నాలు చేసింది. ఆ బిల్లులను పరిశీలించేందుకు సెలక్ట్ కమిటీకి నివేదించాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో మండలి నియమావళిని ఉల్లంఘించింది.
నిబంధనల ప్రకారం శాసనమండలి చైర్మన్కు ముందస్తు నోటీసు ఇవ్వలేదు. నియమావళిలో నిర్దేశించిన ప్రక్రియను పాటించలేదు. కాబట్టి ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి నివేదించడం సాధ్యం కాదని ప్రభుత్వంతోపాటు రాజ్యాంగ నిపుణులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఆ రెండు బిల్లులను శాసనసభలో రెండోసారి ప్రవేశపెట్టి ఆమోదించింది.
మూజువాణి ఓటుతో ఆమోదం
► 'పరిపాలన వికేంద్రీకరణ– ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020'ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, 'సీఆర్డీఏ చట్టం–2014 రద్దు బిల్లు'ను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులను శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
► ఏపీ పంచాయతీ రాజ్ చట్టం –1994 సవరణ బిల్లుకు ఆమోదం. ఏజెన్సీ పంచాయతీల్లో 100 శాతం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను ఎస్టీలకు రిజర్వు చేసేలా చట్ట సవరణకు ఈ బిల్లు తెచ్చారు. ప్రలోభాలు, అక్రమాలకు స్థానం లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా తెచ్చిన మార్పులు కూడా బిల్లులో ఉన్నాయి.
► ఏపీ విలువ ఆధారిత పన్ను చట్టం –2005 సవరణ బిల్లుకు ఆమోదం.
► జీఎస్టీ 38వ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న చట్ట సవరణ నిర్ణయం మేరకు రాష్ట్ర జీఎస్టీ చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన బిల్లుకు ఆమోదం.
► ఏపీ ఆబ్కారీ చట్టం–1968 సవరణ బిల్లుకు ఆమోదం.
► అక్రమ మద్యం వ్యాపారం నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ మద్య నిషేధ చట్టం–1995 సవరణ బిల్లుకు ఆమోదం.
► పురపాలక కార్పొరేషన్ల చట్టం– 1955, ఏపీ పురపాలికల చట్టం–1965 సవరణ బిల్లుకు ఆమోదం.
► ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ తెచ్చిన బిల్లుకు ఆమోదం. విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణతోపాటు ప్రమాణాలు పాటించేలా కమిషన్ పర్యవేక్షిస్తుంది.
► తిరుమల ఆలయం తలుపులు తెరిచి తొలి దర్శనం చేసుకొనే 'సన్నిధి యాదవ్'కు వారసత్వ హక్కు కల్పిస్తూ దేవదాయ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం.
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–జూన్ వరకు బడ్జెట్ కేటాయింపులకు వీలుగా ఆర్డినెన్స్ తెచ్చారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
► రాష్టంలో 8 దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో నియామకాల్లో మార్పులు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును సభ ఆమోదించింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire