భవిష్యత్ ఆలోచనలతో చంద్రబాబు ఒక అడుగు ముందుంటారు
మనమందరం ఇంకా వర్తమానంలోనే ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఎప్పుడూ మనకంటే ఒక అడుగు ముందే ఉంటారని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ కొనియాడారు.
తిరుపతి : దశాబ్ద కాలంగా స్టార్టప్లలో భారత్ దూసుకెళ్తోందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అన్నారు. స్పేస్ ఎకానమీలో 8వ స్థానానికి చేరుకున్నామని చెప్పారు. ఐటీ, టెలికాం రంగాల్లో పెట్టుబడులను సరళతరం చేసినట్లు వివరించారు. శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మనమందరం ఇంకా వర్తమానంలోనే ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఎప్పుడూ మనకంటే ఒక అడుగు ముందే ఉంటారని కొనియాడారు.
‘‘గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 81వ ర్యాంక్ నుంచి 38వ ర్యాంక్కు చేరుకున్నాం. చంద్రుడిపై ప్రయోగాల్లో భారత్ ఘన విజయాలు సాధించింది. రక్షణరంగ ఎగుమతుల్లో గణనీయ వృద్ధి సాధించాం. మన బ్రహ్మోస్ క్షిపణులకు ఇప్పుడు ప్రపంచంలో ఎంతో డిమాండ్ ఉందన్నారు. ప్రపంచానికి కొవిడ్ వ్యాక్సిన్లు అత్యధికంగా ఎగుమతి చేసిన దేశం భారత్. శాస్త్ర, సాంకేతిక రంగాలకు మోదీ హయాంలో బడ్జెట్ పెరిగింది. అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తున్నాం. కీలక ఖనిజాల విషయంలో ప్రైవేటు సంస్థలకూ అనుమతి ఇస్తున్నాం’’ జితేంద్రసింగ్ తెలిపారు.
ఈ సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, ప్రొఫెసర్ భారత్, డాక్టర్ సతీష్ రెడ్డి, సంస్కృత విద్యాపీఠం కులపతి జిఎస్ఆర్కే శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.