Burning Topic: చైనా పరువు మొత్తం పోయిందిగా
Burning Topic: ఆపరేషన్ సింధూర్ వేళ భారత సైన్యం వీరవిహారం! పాకిస్తాన్ ఉపయోగించిన చైనా యుద్ధ విమానాలు మరియు క్షిపణి వ్యవస్థలు ఎందుకు విఫలమయ్యాయి?
Burning Topic: చైనా పరువు మొత్తం పోయిందిగా
Burning Topic: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ శత్రుదేశాన్ని ఎంతగా వణికించిందో ప్రపంచం చూసింది. ఏడాది క్రితం భారత సైన్యం, వైమానిక దళం పాకిస్థాన్తో పాటు ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోకి దూసుకెళ్లి బాంబుల వర్షం కురిపించింది. 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిడ్కేలోని లష్కరే తోయిబా బేస్, సియాల్కోట్, ముజఫరాబాద్, కోట్లీ, భింబర్ ప్రాంతాల్లో ఉగ్ర శిబిరాలను త్రివిధ దళాలు ధ్వంసం చేశాయి. ఎదురుదాడికి దిగిన పాకిస్థాన సైన్యం వెన్ను విరిచింది భారత సైన్యం. దీంతో పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చి మన దేశంతో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ భారత సైన్యం శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటగా, పాకిస్తాన్ పరువు పోయింది. అయినా తామే పై చేయి సాధించామని పాకిస్థాన్ ఫేక్ న్యూస్ ప్రచారం చేసుకోవడం గమరించవచ్చు.
కాగా ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత వైమానిక దాడులను అడ్డుకునేందుకు పాకిస్థాన్ ఉపయోగించిన గగణతల వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. తన సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చైనా తయారీ గగనతల రక్షణ వ్యవస్థలను భారత వైమానిక దళం విజయవంతంగా జామ్ చేసింది. భారత దాడులను గుర్తించడంలో అవి పూర్తిగా విఫలమయ్యాయి. చైనా తయారీ హెచ్క్యూ-9 వాయు రక్షణ వ్యవస్థ, పీఎల్-15 గగనతల క్షిపణులు, జే-10 ఫైటర్ విమానాలు, టర్కీకి చెందిన లాంగ్ రేంజ్ రాకెట్లు, క్వాడ్కాప్టర్లు, కమర్షియల్ డ్రోన్లు వీటన్నింటినీ భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్ధంగా ఎదుర్కొని, ధ్వంసం చేశాయి. చైనా, టర్కీ వంటి దేశాల ఆధునిక ఆయుధాలను పాకిస్థాన్ వినియోగించినా, వాటిపై భారత్ స్వదేశీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు పైచేయి సాధించింది. ఆ యుద్ధం ముగిసిన తర్వా 40 జే-35 ఐదో తరం యుద్ధ విమానాలు, కేజే-500 విమానాలతో పాటు బాలిస్టిక్ క్షిపణులను పాక్కు విక్రయించడానికి చైనా ముందుకొచ్చింది.
పాకిస్తాన్ తన ఆయుధ నిల్వల్లో దాదాపు 81% చైనా నుండే దిగుమతి చేసుకుంటోంది, ఇది రెండు దేశాల మధ్య ఉన్న లోతైన సైనిక సంబంధాన్ని సూచిస్తుంది. పాకిస్థాన్కు రియల్ టైమ్ డేటా, శాటిలైట్ సపోర్ట్ను కూడా అందించింది డ్రాగన్.. భారత భద్రతా దళాలు ఎక్కడెక్కడ మొహరించాయి, వాళ్ల కదలికలతో పాటు క్షిపణుల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడూ పాక్కు చైనా చేరవేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తాము పాకిస్థాన్కు సరఫరా చేసిన రక్షణ వ్యవస్థల వైఫల్యం చైనా పరువు తీసింది. చైనా ఆయుధాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోవడంతో, అంతర్జాతీయ మార్కెట్లో వాటి విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ భారత్ మీద పాకిస్థాన్ ఉపయోగించిన తమ ఆయుధాలు విజయవంతమయ్యాయని చైనా ప్రచారం చేసుకుంది. అదే సమయంలో భారత సైన్యం ఉపయోగిస్తున్న ఫ్రాన్స్కు చెందిన రఫేల్ యుద్ధ విమానాల మీద దుష్ప్రచారం మొదలు పెట్టింది.
కాగా భారత్తో జరిగిన పోరులో తమకు విదేశాల నుంచి ఎలాంటి సాయం అందలేదని అప్పట్లోనే పాకిస్థాన్ బుకాయించింది. తాము విదేశీ సాయం తీసుకున్నామనడం బాధ్యతారాహిత్యం, అవాస్తవం అన్నారు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్. తాము చేసిన కృషితో దేశీయంగా సాధించిన సామర్థ్యాన్ని గుర్తించడానికి ఇష్టపడక ఇలా మాట్లాడుతున్నారు. పూర్తిగా రెండు దేశాలకు పరిమితమైన సైనిక ఘర్షణలో ఇతర దేశాల పేర్లను లాగడం తగదు అని చెప్పుకొచ్చారు. మరోవైపు భారత్తో జరిగిన ఘర్షణలో తమ దేశమే విజయం సాధించింది తమ దేశ పాఠ్యపుస్తకాలలో అసత్య ప్రచారం చేసుకుంది
‘భారత్ 2025 మే 6న పాకిస్తాన్పై అనూహ్యంగా యుద్ధం ప్రారంభించింది. అయితే పాకిస్తాన్ సైన్యం తెలివిగా స్పందించి, భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపై భారత్ శాంతికి మొగ్గుచూపుతూ యుద్ధాన్ని ఆపేలా చేసుకుంది” అని పేర్కొంది. పాకిస్తాన్ సైన్యానికి నేతృత్వం వహించిన ఆర్మీ చీఫ్ అసిం మునీర్కు ఫీల్డ్ మార్షల్ బిరుదు అందించినట్లు కూడా దానిలో రాశారు.
ఇదిలా ఉంటే ఆపరేషన్ సిందూర్ సమయంలో తాము పాకిస్థాన్ను సాయం చేసిన మాట వాస్తవమే అని తాజాగా చైనా అంగీకరించింది. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా సంస్థ అధీనంలోని చెంగ్దు ఎయిర్క్రాఫ్ట్ డిజైన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ అధికారులు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ వద్దనున్న జె–10సీఈ యుద్ధ విమానాలు ఏవీఐసీ అనుబంధ సంస్థ తయారు చేసినవే ఆ నాలుగు రోజుల యుద్ధం సమయంలో తాము పాకిస్థాన్లోని ఎయిర్ బేస్లో సాంకేతిక మద్దతిచ్చామని వెల్లడించారు. అక్కడ యుద్ధ విమానాలు టేకాఫ్ అయ్యే భీకరమైన సౌండ్స్ నిత్యం మాకు వినిపించేవి. ఎడతెరిపి లేకుండా ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతుండేవి. ఆ సమయం మాకు మానసికంగా, శారీరకంగా ఒక పెద్ద పరీక్షలా అనిపించేది ఆ యుద్ధ విమానాలు పూర్తి పోరాట సామర్థ్యంతో పనిచేయగలవని నిరూపించాలనే సంకల్పంతో తమ బృందం శ్రమించింది అని గొప్పగా చెప్పుకున్నారు.
తమ సంస్థ తయారు చేసిన జే-10సీఈ యుద్ధ విమానం అనేది ఒక పిల్లాడి లాంటిదని చెప్పారు జాంగ్ హెంగ్. మేం దాన్ని పోషించి, సంరక్షించి, పాకిస్థాన్కు అప్పగించాం. ఆ ఫలితాల్ని చూసి మేం పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అవి మేం అనుకున్న విధంగానే పనిచేశాయి. కేవలం ఆ సైనిక ఘర్షణ రూపంలో వాటికి యుద్ధ క్షేత్రంలో నిరూపించుకునే అవకాశం లభించింది. ఆ సమయం వచ్చినప్పుడు, మేం ఊహించినట్టుగానే అది తన పనిని కచ్చితత్వంలో చేసింది" అని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ను చైనా ఒక లైవ్ ల్యాబ్గా ఉపయోగించుకొని పాకిస్థాన్కు చురుకైన సైనిక మద్దతును అందించిందని భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్. సింగ్ గతేడాది జులైలో ఆరోపించారు. చైనా శాటిలైట్ల ద్వారా భారత సైనిక మోహరింపుల సమాచారాన్ని సేకరించి పాక్కు ఎప్పటికప్పుడు చేరవేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై చైనా వైపు నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందనా రాలేదు.