తెలంగాణలో ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు షాక్.. భారీ జరిమానాలు విధించిన ఇంటర్ బోర్డు
నిబంధనలు ఉల్లంఘించిన 95కుపైగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై టీజీ బీఐఈ రూ.10 లక్షల వరకు జరిమానాలు విధించింది. కొన్ని కాలేజీల అఫిలియేషన్ను నిలిపివేసింది.
Telangana Intermediate Board
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీజీ బీఐఈ) రాష్ట్రంలోని నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై కఠిన చర్యలు చేపట్టింది. గత నెల రోజులుగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు బయటపడటంతో 95కుపైగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు భారీ జరిమానాలు విధించింది.
బోర్డు టాస్క్ఫోర్స్ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో అనుమతులు లేకుండా విద్యార్థుల ప్రవేశాలు చేపట్టడం, అక్రమంగా కాలేజీలు నిర్వహించడం వంటి పలు ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
విద్యాసంస్థల్లో నిబంధనల అమలును కట్టుదిట్టం చేయడానికి టాస్క్ఫోర్స్ తనిఖీలు కొనసాగుతాయని టీజీ బీఐఈ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
అలాగే, మౌలిక సదుపాయాలు, అగ్నిమాపక భద్రత, విద్యా ప్రమాణాలను పాటించని ఐదుకుపైగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు 2026–27 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ను నిలిపివేసింది.
విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ తీసుకునే ముందు సంబంధిత కాలేజీకి టీజీ బీఐఈ అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని బోర్డు సూచించింది.