Yama Dwaram Mystery: తస్మాత్ జాగ్రత్త: ఆ ‘యమద్వారం’ వద్ద రాత్రి నిద్రిస్తే మరణమే
కైలాస యాత్రలో భాగంగా పరిక్రమ చేసే క్రమంలో యమద్వారం వద్ద రాత్రివేళ నిద్రంచకూడదు. ఎందుకో తెలుసా?
Yama Dwaram Mystery: ప్రపంచంలో అత్యంత పవిత్రమైన, కష్టతరమైన, రహస్యమైన యాత్ర ఏదైనా ఉందంటే అది కైలాస మనస సరోవర యాత్ర మాత్రమే. అయితే, ఈ పరమశివుని చెంతకు వెళ్లే దారిలోనే ఒక భయంకరమైన, ఇప్పటికీ సైన్స్కు సైతం చిక్కని ఒక రహస్య ప్రదేశం ఉంది. దాన్నే ‘యమద్వారం’ అంటారు. కైలాస ప్రదక్షిణ చేసే ప్రతి భక్తుడు ఈ ద్వారం గుండానే వెళ్లాలి. కానీ, ఇక్కడున్న ఒక కఠినమైన నియమం ఏంటంటే... ఈ యమద్వారం వద్ద రాత్రి పూట ఎవరూ బస చేయకూడదు, నిద్రించకూడదు. ఒకవేళ ఇక్కడ రాత్రి గడిపితే వారు త్వరలోనే మరణిస్తారని శతాబ్దాలుగా ఒక నమ్మకం ఉంది. ఇప్పటికీ ఈ రహస్యాన్ని ఎవరూ ఛేదించలేకపోయారు.
టిబెటన్ల టార్బోచే... పాపాలను తుడిచేసే ద్వారం!
టిబెట్లోని ‘దాచ్చేన్’ అనే ప్రాంతం నుండి కేవలం 30 నిమిషాలు కాలినడకన ప్రయాణిస్తే ఈ యమద్వారం మనకు దర్శనమిస్తుంది. టిబెట్ స్థానిక భాషలో దీనిని ‘టార్బోచే’ అని పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం, ఈ ప్రాంతాన్ని ఆ యమధర్మరాజు స్వయంగా కాపాడుతుంటాడు. భక్తులు కైలాస యాత్ర చేసేటప్పుడు ఈ ద్వారం గుండా వెళ్లే సమయంలో, యమధర్మరాజు సహాయకుడైన చిత్రగుప్తుడు తన పుస్తకంలో మానవులు చేసిన కొన్ని పాపాలను, చెడు పనులను తుడిచివేస్తాడని భక్తుల నమ్మకం. ఈ ద్వారం దాటిన తర్వాత భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదనే నియమం కూడా ఉంది.
రాత్రి పూట నిద్రిస్తే ఏమవుతుంది?
ఇంతటి పవిత్రమైన చోటు మరణ శాసనంగా ఎందుకు మారుతుందనే దానికి స్థానికులు కొన్ని కారణాలు చెబుతుంటారు. ఈ యమద్వారం వద్ద రాత్రి వేళల్లో బస చేయడానికి ప్రయత్నించిన పర్యాటకులు, సాధువులు చాలామంది మరణించారని అక్కడి ప్రజలు చెబుతారు. అయితే వారు ఎందుకు చనిపోతున్నారు, ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుందనేది నేటికీ ఒక అపరిచిత రహస్యంగానే మిగిలిపోయింది. అంతేకాదు, కైలాస పర్వతం, అష్టపద, సప్త ఋషి గుహలకు సమీపంలో ఈ ద్వారం ఉండటం వల్ల ఇక్కడ ఒక రకమైన వింతైన శక్తి ప్రసరిస్తుంటుంది. రాత్రి వేళల్లో ఆ శక్తి తీవ్రతను మనుషుల శరీరం తట్టుకోలేకపోవడమే మరణానికి కారణం కావచ్చు అని కొందరి అంచనా. దీంతోపాటు, మరణానికి అధిపతి అయిన యముడి ముఖద్వారం కావడంతో, సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ సంచరించడం ప్రకృతి నియమాలకు విరుద్ధమని పెద్దలు చెబుతారు.
కైలాస యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ యమద్వారాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించి, పగటి పూట మాత్రమే దాటి వెళ్తుంటారు. ప్రకృతి దాచిన కొన్ని రహస్యాలను సైన్స్ కూడా గౌరవించక తప్పదు అనడానికి ఈ యమద్వారమే ఒక నిదర్శనం. భగవంతుని సృష్టిలో కొన్ని శక్తులను మనం ప్రశ్నించకుండా, భక్తితో నమస్కరించి ముందుకు సాగడమే మనకు శ్రేయస్కరం!