Puri Jagannath: పూరీ జగన్నాథుడికి లీలా... ఆలయంలో ఆదివాసీలకే అగ్రతాంబూలం

ఒడిశా పూరీ ఆలయంలో జరిగే వివిధ రకాలైన కైంకర్యాలలో ప్రధాన అర్చకులతో పాటు సవర తెగ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సవర తెగకు స్వామివారికి ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం.

Update: 2026-06-27 03:53 GMT

Puri Jagannath: ఒడిశా అంటే మనకు గుర్తుకు వచ్చేది పూరీ జగన్నాథుడు. ఆషాఢమాసంలో జరిగే రథయాత్ర కోసం యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తుంటుంది. అయితే, ఈ ఒక్క యాత్ర మాత్రమే కాదు... ఆలయంలో జరిగే ప్రతి సేవ వెనుక ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం దాగుంది. ఈ ఆలయంలో నిర్వహించే విధులు, ఆచారాలు మామూలు మనుషులు నిర్ణయించినవి కావు. ఆ పరమాత్ముడే నిర్దేశించినవి. పూరీ ఆలయ సంప్రదాయాల ప్రకారం... ప్రతి ఏటా జరిగే జగన్నాథుని జగత్ప్రసిద్ధ రథయాత్రలో స్వామివారి నవకలేబర మూర్తులను గర్భగుడి నుండి బయటకు తీసుకురావడం, రథంపై అధిష్టింపజేయడం వంటి అత్యంత పవిత్రమైన కైంకర్యాలను నిర్వహించే హక్కు కేవలం ఒడిశాకు చెందిన ‘సవర’ అనే ఆదివాసీ గిరిజన తెగకు మాత్రమే ఉంది. సమాజంలో వెనుకబడినట్లుగా భావించే వనజీవులకు, లోకాలను ఏలే ఆ జగన్నాథుడు తన సేవలో అగ్రతాంబూలం ఇవ్వడం సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యానికి నిదర్శనం.

నీలమాధవుడే జగన్నాథుడు ... పురాణాల సాక్ష్యం

భాగవతం, స్కందపురాణం, బ్రహ్మపురాణం వంటి పవిత్ర గ్రంథాలలో పూరీ జగన్నాథుని ఆవిర్భావం వెనుక ఈ సవర తెగ ప్రాముఖ్యత వివరంగా కనిపిస్తుంది. పూర్వం దట్టమైన అరణ్యాలలో సవర తెగకు చెందిన ‘విశ్వావసు’ అనే భక్తుడు "నీలమాధవుడు" అనే దైవాన్ని గుప్తంగా పూజించేవాడు. విశ్వావసుని నిష్కల్మషమైన భక్తికి మెచ్చిన ఆ నీలమాధవుడే, తదనంతర కాలంలో రాజు ఇంద్రద్యుమ్నుడి నిమిత్తంగా పూరీ క్షేత్రంలో జగన్నాథుడిగా ఆవిర్భవించాడు. తన మూలాలు అడవిలోనే ఉన్నాయని, తాను శబరుల దైవాన్ని అని చాటడానికే స్వామివారు ఇప్పటికీ ఆ తెగ వారసుల చేతుల మీదుగానే సేవలు అందుకుంటున్నారు. ఆలయంలో వీరిని ‘దైతాపతులు’ అని కూడా పిలుస్తారు.

నవకలేబరంలో సవరల కీలక పాత్ర

పూరీ ఆలయంలో ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి అత్యంత రహస్యంగా జరిగే ‘నవకలేబరం’ అంటే స్వామివారి పాత విగ్రహాలను మార్చి నూతన విగ్రహాలను ప్రతిష్టించే ఉత్సవంలో కూడా ఈ సవర తెగ వారే సర్వస్వమై వ్యవహరిస్తారు. నూతన విగ్రహాల తయారీకి కావలసిన పవిత్ర వేప వృక్షాన్ని అడవిలో ముందుగా గుర్తించేది వీరే. అంతేకాదు, పాత మూలవిరాట్ నుండి అత్యంత నిగూఢమైన ‘బ్రహ్మ పదార్థాన్ని’ తీసి, నూతన జగన్నాథుని విగ్రహంలోకి ప్రవేశపెట్టే అర్హత కూడా కేవలం ఈ తెగకు చెందిన ప్రధాన అర్చకుల చేతుల మీదుగానే సాగుతుంది. భగవంతుడు కేవలం అలంకారాలకో, అగ్రకులానికో దాసుడు కాదని... నిష్కల్మషమైన భక్తికి మాత్రమే లొంగుతాడని నిరూపించే ఈ సవర తెగ సేవలు పూరీ క్షేత్రానికే ఒక దివ్య ఆభరణం. ఆలయంలో అర్చకుల మాదిరిగానే ఈ తెగకు చెందిన వారు కూడా పవిత్రమైన ఆచారాలను పాటిస్తుంటారు.   

Tags:    

Similar News