Venezuelan Oil for India: వెనుజులా చమురుతో భారత్ గట్టెక్కుందా?
ప్రస్తుతం ఇరాన్ యుద్ధం, దానికి తోడు చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఈ భౌగోళిక రాజకీయ తుఫాను మధ్య, భారత్ తన ఇంధన అవసరాల కోసం సరికొత్త ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంది.
Venezuelan Oil for India: ప్రస్తుతం ఇరాన్ యుద్ధం, దానికి తోడు చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఈ భౌగోళిక రాజకీయ తుఫాను మధ్య, భారత్ తన ఇంధన అవసరాల కోసం సరికొత్త ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంది. ఈ మే నెలలో వెనిజులా భారత్కు మూడో అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా అవతరించింది. ఏప్రిల్తో పోలిస్తే వెనిజులా నుండి భారత్కు చమురు దిగుమతులు ఏకంగా 50 శాతం పెరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే రోజుల్లో వెనుజులా నుంచి మరింత ఎక్కువ మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి భారత్ సిద్దమౌతున్నది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వెనుజులా తాత్కాలిక అధ్యక్షుడు భారత్లో పర్యటించనున్నారు. వెనుజులా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ముడి చమురుపై కీలక చర్చలు నిర్వహించనున్నారు.
వెనిజులా చమురు సామర్థ్యం ఎంత?
ప్రపంచంలోనే అత్యధికంగా 303 బిలియన్ బారెళ్ల అపారమైన ముడి చమురు నిల్వలు ఒక్క వెనిజులాలోనే ఉన్నాయి. ఇది సౌదీ అరేబియా, అమెరికా కంటే కూడా ఎక్కువ. అయినప్పటికీ, గతంలో అమెరికా విధించిన ఆంక్షల వల్ల అక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం ఇరాన్ సంక్షోభం కారణంగా, గల్ఫ్ దేశాల నుండి భారత్కు వచ్చే చమురు సగానికి పడిపోయింది. సౌదీ అరేబియా సరఫరా ఏప్రిల్లో రోజుకు 6,70,000 బారెళ్లు ఉండగా, ఈ నెలలో అది 3,40,000 బారెళ్లకు పడిపోయింది. ఈ లోటును పూడ్చడానికి వెనిజులా నుండి ఈ నెలలో రోజుకు 4,17,000 బారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. వెనుజులాపై ఆంక్షల నేపథ్యంలో ఏప్రిల్ ముందు వరకు ఒక్క బారెల్ చమురు కూడా భారత్ కొనుగోలు చేయలేదు. వెనుజులాపై ఎప్పుడైతే ఆంక్షలు ఎత్తివేశారో అప్పటి నుంచే భారీ ఎత్తున చమురు కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. అంతేకాదు, మిగతా దేశాల ముడి చమురుతో పోలిస్తే వెనుజులా నుంచి వచ్చే చమురు ఎక్కుడ థిక్నెస్ ఉంటుంది. దేశంలోని రిఫైనరీలకు ఇటువంటి ఆయిల్ ఎంతో ఉపయోగం.
అమెరికా 'డబుల్ గేమ్'.. భారత్పై ఒత్తిడి!
ఈ చమురు రాజకీయం వెనుక అమెరికా పెద్ద వ్యూహాన్నే నడుపుతోంది. రష్యా చమురుపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించాలని వాషింగ్టన్ ఒత్తిడి చేస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మే 23 నుండి 26 వరకు భారత్లో పర్యటిస్తున్నారు. మరోవైపు వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ కూడా వచ్చే వారం భారత్కు రానున్నారు. భారత్కు రష్యా లేదా వెనిజులా అనే రెండు ఆప్షన్లే మిగిలాయి. రష్యా ఆయిల్ రవాణాపై అమెరికా ఇచ్చిన 30 రోజుల మినహాయింపు తాత్కాలికం మాత్రమే. అందుకే వెనిజులా భారీ చమురు నిల్వలను అంతర్జాతీయ మార్కెట్లోకి తెచ్చి, ఇరాన్ ప్రాధాన్యతను తగ్గించాలని అమెరికా చూస్తోంది.
భారత రిఫైనరీలకు కలిసొచ్చే అంశం
వెనిజులా నుండి వచ్చే చమురు అత్యంత బరువైనది. దీనినే అల్ట్రా-హెవీ క్రూడ్ అని పిలుస్తారు. దీనిని శుద్ధి చేయడం సాధారణ రిఫైనరీలకు సాధ్యం కాదు. కానీ, గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ కావడం వల్ల, ఈ రకమైన గట్టి చమురును చాలా సులభంగా, సమర్థవంతంగా శుద్ధి చేయగలదు. అయితే, అమెరికా నుండి వెనిజులా మీదుగా భారత్కు చమురు రావడం చాలా సుదీర్ఘమైన, ఖరీదైన మార్గం. అయినప్పటికీ, దేశీయంగా ప్రతిరోజూ 49 లక్షల బారెళ్ల చమురు అవసరమున్న భారత్కు ప్రస్తుత సంక్షోభంలో వెనిజులా చమురు ఒక పెద్ద సంజీవనిలా మారిందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో కుదిరే ఒప్పందాలు భారత్ ఇంధన భద్రతను మరింత శాసించనున్నాయి. ఇప్పటికే దేశంలో మూడుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. మరోసారి ధరలు పెరగకుండా ఉండాలంటే... చమురు దిగుమతులు పెరగాలి. కొరత లేకుండా చూసుకోవాలి. ఒపెక్ కూటమి నుంచి యూఏఈ బయటకు రావడంతో ఇక్కడి నుంచి కూడా చమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేందుకు భారత్ ప్లాన్ చేస్తున్నది. దీంతో పాటు వ్యూహాత్మక చమురు నిల్వల గిడ్డంగులను పెంచేందుకు కూడా కసరత్తు చేస్తున్నది.