Kurnool: కర్నూలు కార్పొరేషన్లో కీలక మార్పులు.. రేపే ముసాయిదా విడుదల!
Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల సంఖ్య 52 నుండి 68కి పెరిగింది.
Kurnool: కర్నూలు కార్పొరేషన్లో కీలక మార్పులు.. రేపే ముసాయిదా విడుదల!
కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వం మార్చి 24న జారీ చేసిన జీవో నెంబర్ 65 ఉత్తర్వుల మేరకు కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను సోమవారం ప్రచురించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం వార్డుల సరిహద్దులతో కూడిన ప్రతిపాదిత ముసాయిదాను అధికారికంగా ప్రచురించి, మున్సిపల్, కలెక్టరేట్, ఆర్డీవో, తహశీల్దార్లు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
2011 జనాభా లెక్కల ఆధారంగా, అన్ని సమగ్ర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ముసాయిదాను రూపొందించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ముసాయిదాపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు నగరపాలక కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగానికి వ్రాతపూర్వకంగా సమర్పించాలని కమిషనర్ కోరారు.