Mydukur: మైదుకూరు మున్సిపల్ ఆఫీస్ ఎదుట రైతు సేవా సమితి భారీ నిరసన..
Mydukur: కడప జిల్లా మైదుకూరు పట్టణంలో మున్సిపల్ స్థలాలు, రోడ్లు, డ్రైనేజీల ఆక్రమణలపై రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
మైదుకూరు / వైఎస్ఆర్ కడప జిల్లా: మైదుకూరు పట్టణంలో మున్సిపల్ స్థలాలు, రోడ్లు, డ్రైనేజీ కాలువల ఆక్రమణదారులకు మున్సిపల్ కార్యాలయం అండగా నిలుస్తోందని రైతు సేవా సమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ తీవ్రంగా ఆరోపించారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో మైదుకూరు పట్టణ మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఏవి. రమణ మాట్లాడుతూ, మైదుకూరు గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారిన తర్వాత పట్టణంలో ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. బద్వేల్ రోడ్డులోని విలియమ్స్ నగర్ కాలనీలో ఆక్రమణకు గురవుతున్న మున్సిపల్ స్థలాన్ని అధికారులు వెంటనే పరిశీలించి, స్వాధీనం చేసుకుని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆక్రమణలపై కఠిన చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో రైతు సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, పట్టణ ప్రజలను ఏకం చేసి దశలవారీగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం ఈ సమస్యలపై మైదుకూరు మున్సిపల్ కమిషనర్ రంగస్వామికి వినతిపత్రం సమర్పించారు.