Terror Strikes : కరాచీలో బాంబుల మోత.. ఉగ్రవాదుల మెరుపుదాడితో దద్దరిల్లిన పాక్ నగరం
Terror Strikes : పాకిస్థాన్ కరాచీలో రేంజర్స్ కార్యాలయంపై ఉగ్రదాడి జరిగింది. భారీ పేలుడు, కాల్పుల్లో 8 మంది మృతి చెందారు.
Terror Strikes
Terror Strikes : పాకిస్థాన్లోని కరాచీ నగరం మరోసారి రక్తపాతంతో తడిసిపోయింది. శనివారం రాత్రి కరాచీలోని గులిస్థాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో ఉన్న రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మొదట కార్యాలయం గేటు వద్ద భారీ పేలుడు సంభవించగా, వెంటనే ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పాక్ రేంజర్స్ జవాన్లతో సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిత్యం రద్దీగా ఉండే విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ఈ దాడి జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కరాచీలోని గులిస్థాన్-ఎ-జౌహర్ ప్రాంతం శనివారం రాత్రి ఒక్కసారిగా భారీ పేలుడుతో దద్దరిల్లింది. రేంజర్స్ కార్యాలయం వద్ద జరిగిన ఈ దాడి, ఉగ్రవాదుల పక్కా ప్లాన్ అని అర్థమవుతోంది. పేలుడు జరిగిన వెంటనే సమీపంలోని ప్రాంతమంతా తుపాకీ గుళ్ల శబ్దాలతో నిండిపోయింది. దాడిలో ముగ్గురు సింధ్ రేంజర్స్ జవాన్లు అక్కడికక్కడే అమరులయ్యారు. మొత్తం 8 మంది మరణించగా, ముగ్గురు ఉగ్రవాదులను కూడా భద్రతా దళాలు మట్టుబెట్టినట్లు సమాచారం.
ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, పాకిస్థాన్ పోలీసులు, యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్, స్పెషల్ సెక్యూరిటీ యూనిట్ కమాండోలు రంగంలోకి దిగారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి, అదనపు బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాధితులను తరలించేందుకు రెస్క్యూ 1122 సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
ఈ దాడి ఘటనపై సింధ్ ప్రావిన్స్ ఐజీ జావేద్ ఆలం ఓధో స్పందిస్తూ, ప్రాథమిక సమాచారం మేరకు రేంజర్స్ స్థావరం లక్ష్యంగా జరిగిన దాడిలో 8 మంది చనిపోయారని ధృవీకరించారు. మరోవైపు, సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. తక్షణమే ఈ దాడిపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీసు, ఇతర భద్రతా విభాగాల అధికారులతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు.
కరాచీ వంటి రద్దీ ప్రాంతంలో, అది కూడా అత్యంత భద్రత ఉండే రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై దాడి జరగడం పాకిస్థాన్ భద్రతా వైఫల్యానికి అద్దం పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీలు, వాతావరణ శాఖ కార్యాలయాలకు దగ్గరగా ఉండటంతో, భయంకరమైన వాతావరణం నెలకొంది. నిరంతరం అశాంతితో సతమతమవుతున్న పాకిస్థాన్లో, మళ్లీ ఇలాంటి ఉగ్రదాడి జరగడం ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది.