Pocharam: శ్రీనిధి యూనివర్సిటీ సమీపంలో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం!
Pocharam: యమ్నంపేటలో తీవ్ర కలకలం - శ్రీనిధి యూనివర్సిటీ సమీపంలో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం గుర్తింపు - హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు
Pocharam: శ్రీనిధి యూనివర్సిటీ సమీపంలో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం!
Pocharam: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి యమ్నంపేటలోని శ్రీనిధి యూనివర్సిటీ సమీపంలోని చెట్ల పొదల్లో కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని యూనివర్సిటీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ను రప్పించి సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి వయసు సుమారు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో సుమారు వారం రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మెడపై ఉరి వేసి, గుంజుక పోయిన ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం.
మహిళ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనిధి యూనివర్సిటీ లో చదువుతున్న విద్యార్థినా లేదా మరెవరైనాన అనే విషయం తెలియాల్సి ఉంది. ఆమెపై లైంగిక దాడి జరిగిందా? అనంతరం హత్య చేసి మృతదేహాన్ని అక్కడ పడేశారా? అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది.
మృతురాలి ఆచూకీ, గుర్తింపు కోసం పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును ముమ్మరం చేయనున్నట్లు సమాచారం.




