Vikarabad: పదో ఫలితాల వేళ పిల్లలకు అండగా నిలవండి: వికారాబాద్ ఎస్పీ

Vikarabad: పదో తరగతి ఫలితాల సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించాలని, ఒత్తిడికి గురిచేయవద్దని వికారాబాద్ ఎస్పీ స్నేహా మెహ్రా సూచించారు.

Update: 2026-04-29 06:20 GMT

Vikarabad

Vikarabad: పదో తరగతి ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా నిలవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా సూచించారు.

ఫలితాలు ఎలా వచ్చినా పిల్లలను ప్రేమతో ప్రోత్సహించాలని, తక్కువ మార్కులు వచ్చాయని లేదా ఫెయిల్ అయ్యారని వారిని దండించడం, నిందించడం చేయవద్దని ఆమె తెలిపారు. పదేళ్ల విద్యా ప్రయాణంలో ఇది ఒక చిన్న దశ మాత్రమేనని, జీవితానికి ఇది చివరి పరీక్ష కాదని తల్లిదండ్రులు గుర్తించాలని పేర్కొన్నారు.

పిల్లలను ఇతరులతో పోల్చడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదని, భవిష్యత్తుపై ధైర్యం కల్పిస్తూ వారిని ముందుకు నడిపించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యే అవకాశమున్నందున వారి ప్రవర్తనను గమనిస్తూ స్నేహపూర్వకంగా ఉండాలని తెలిపారు.

ఆశించిన ఫలితాలు రాకపోయినా నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించేలా ప్రోత్సహించాలని, “ఓటమి గెలుపుకు తొలిమెట్టు” అనే భావనను వారికి అర్థమయ్యేలా చేయాలని కోరారు. ఫలితాల ప్రభావంతో విద్యార్థులు ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులు అండగా ఉండాలని, జిల్లా పోలీస్ యంత్రాంగం ఎప్పుడూ విద్యార్థుల భవిష్యత్తు కోసం తోడ్పాటునందిస్తుందని తెలిపారు.

Tags:    

Similar News