Malkajgiri: సంచార జాతుల సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాలి
Malkajgiri: సంచార, విముక్త జాతుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర సంచార జాతుల బోర్డు మాజీ చైర్మన్ భికు రాంజీ ఇదాతే డిమాండ్ చేశారు.
Malkajgiri: సంచార జాతుల సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాలి
మల్కాజ్గిరి: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్ పరిధిలో సంచార, విముక్త జాతులపై ప్రభుత్వాల నిర్లక్ష్యం ఇకనైనా ముగించాలని కేంద్ర సంచార జాతుల బోర్డు మాజీ చైర్మన్ భికు రాంజీ ఇదాతే డిమాండ్ చేశారు. సంచార, విముక్త జాతుల సమగ్ర అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం శాశ్వత ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.
జవహర్నగర్ పరిధిలోని వడ్డే ఓబన్న విగ్రహ ప్రాంగణంలో నర్రా మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ విముక్త దినోత్సవ కార్యక్రమానికి భికు రాంజీ ఇదాతే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచార, విముక్త జాతుల సమస్యలకు కంటితుడుపు చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. వారి విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
సంచార జాతుల విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంచార, విముక్త జాతుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, వారి సమస్యలను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అప్పాల ప్రసాద్, స్వర్ణకుమార్, చిరంజీవి, దుర్గేష్, రామ్, యు. మల్లేష్, రాజన్ షిండే, సువీర్జీ తదితరులు పాల్గొన్నారు.