Hyderabad: బీజేపీలో ఫ్లెక్సీల వార్: ప్రధాని మోదీ పర్యటన వేళ రచ్చకెక్కిన అంతర్గత విభేదాలు!
ప్రధాని నరేంద్ర మోదీ పరేడ్ మైదానం సభకు ముందు హైదరాబాద్ బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మోండా మార్కెట్ పరిధిలో మోదీ ఫ్లెక్సీలను మాజీ కార్పొరేటర్ భర్త నరేష్ చింపివేయడం చర్చనీయాంశమైంది.
Hyderabad: బీజేపీలో ఫ్లెక్సీల వార్: ప్రధాని మోదీ పర్యటన వేళ రచ్చకెక్కిన అంతర్గత విభేదాలు!
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు విచ్చేస్తున్న తరుణంలో బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. సభను పురస్కరించుకుని నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సొంత పార్టీ నాయకులే తొలగించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మోండా మార్కెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక భర్త నరేష్.. పార్టీకి చెందిన మరో నాయకుడు నర్సింగ్ రావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేయడం కలకలం రేపింది.
పరేడ్ మైదానం సమీపంలోని బస్ షెల్టర్ వద్ద ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో మోదీ చిత్రపటం ఉన్న భాగాన్ని ఆగ్రహంతో చింపివేయడంపై పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఒకే పార్టీలో ఉంటూ, ప్రధాని పర్యటన వేళ ఇలాంటి చర్యలకు పాల్పడటం బీజేపీలోని వర్గ పోరును స్పష్టం చేస్తోంది. ఈ ఘటనపై పార్టీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.