EPFO: ప్రైవేట్ ఉద్యోగులకు పండగలాంటి వార్త.. ఇకపై రూ. 25 వేల జీతమున్నా అవి తప్పనిసరి?
EPFO: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది.
EPFO: ప్రైవేట్ ఉద్యోగులకు పండగలాంటి వార్త.. ఇకపై రూ. 25 వేల జీతమున్నా అవి తప్పనిసరి?
EPFO: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (EPF), ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS)లో తప్పనిసరిగా చేరేందుకు ఉన్న వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం.
PF వేతన పరిమితి ఎందుకు పెంచుతున్నారు?
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, నెలకు రూ.15,000 వరకు ప్రాథమిక వేతనం (Basic Salary) పొందే ఉద్యోగులకు మాత్రమే EPF, EPS పథకాలు తప్పనిసరి. రూ.15,000 కంటే ఎక్కువ వేతనం ఉంటే, ఉద్యోగిని ఈ పథకాలలో చేర్చాలా వద్దా అనేది యజమాని, ఉద్యోగి పరస్పర అంగీకారంపై ఆధారపడి ఉంటుంది. అలాంటి ఉద్యోగులను తప్పనిసరిగా EPF పరిధిలోకి తీసుకురావాల్సిన చట్టబద్ధమైన బాధ్యత యాజమాన్యంపై ప్రస్తుతం లేదు.
రూ.25 వేల వరకు వేతనం ఉన్న ఉద్యోగులకు ప్రయోజనం
కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే రూ.15,000 నుంచి రూ.25,000 వరకు ప్రాథమిక వేతనం పొందే లక్షలాది ప్రైవేట్ ఉద్యోగులు కూడా తప్పనిసరిగా EPF, EPS పథకాల పరిధిలోకి వస్తారు. దీంతో ఇప్పటివరకు ఈ ప్రయోజనాలకు దూరంగా ఉన్న ఉద్యోగులు కూడా భవిష్య నిధి, పెన్షన్ సదుపాయాలను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రైవేట్ ఉద్యోగులకు ఇది ఎంతో ప్రయోజనకరమైన నిర్ణయంగా భావిస్తున్నారు.
ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
PF, EPS పరిధిలోకి రావడం వల్ల ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత మెరుగైన ఆర్థిక భద్రత లభిస్తుంది. ఉద్యోగ కాలంలో ప్రతి నెలా PFలో పొదుపు పెరగడంతో పాటు, ఉద్యోగుల పెన్షన్ పథకం ప్రయోజనాలు కూడా అందుతాయి.
దీంతో భవిష్యత్తులో ఆర్థికంగా మరింత భరోసా లభించడంతో పాటు, సామాజిక భద్రత కూడా బలపడుతుంది.
ఎప్పటి నుంచి అమలు చేయనున్నారు.?
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినప్పటికీ, ఇది ఇంకా తుది నిర్ణయం కాదు. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించిన తర్వాతే అధికారికంగా అమలు తేదీని ప్రకటిస్తారు.
ఆ తర్వాత దేశవ్యాప్తంగా లక్షలాది ప్రైవేట్ ఉద్యోగులు EPF, EPS పథకాల విస్తృత ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, ఉద్యోగుల పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేసే కీలక సంస్కరణగా నిలుస్తుంది.