E20 Petrol: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇథనాల్ తయారీకి చెరకు బంద్?
E20 Petrol: దేశంలో చక్కెర ధరలు పెరగడంతో ఎథనాల్ తయారీకి చెరకు వినియోగాన్ని తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది.
Sugarcane
E20 Petrol: దేశీయంగా చక్కెర ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న కొత్త సీజన్లో ఇథనాల్ తయారీకి చెరకు రసం, బి-హెవీ మోలాసెస్ వినియోగాన్ని పరిమితం చేయడం లేదా పూర్తిగా నిలిపివేయడంపై కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తోంది. చక్కెర ఉత్పత్తిని పెంచి, నిల్వలను పునరుద్ధరించడం ద్వారా మార్కెట్లో పెరిగిన ధరలను అదుపు చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ, పరిశ్రమ వర్గాల వర్గాలు వెల్లడించాయి.
మహారాష్ట్ర, కర్ణాటకలో తగ్గిన వర్షపాతం
భారతదేశంలో చెరకును అత్యధికంగా ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాభావ పరిస్థితుల వల్ల రాబోయే సంవత్సరంలో చెరకు దిగుబడి తగ్గి, చక్కెర ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇథనాల్ తయారీ కంటే చక్కెర సరఫరాకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దేశీయంగా చక్కెర లభ్యత పెరుగుతుంది. ఫలితంగా ఉత్పత్తి తగ్గినా విదేశాల నుంచి చక్కెరను దిగుమతి చేసుకునే పరిస్థితి రాకుండా భారత్ తనను తాను కాపాడుకోగలదు. దీనిపై వచ్చే నెల చివరి నాటికి తుది నిర్ణయం వెలువడే అవకాశముంది.
ఇథనాల్ తయారీకి వాడిన 30 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర
ప్రస్తుత సెప్టెంబర్తో ముగిసే సీజన్లో చక్కెర మిల్లులు ఇథనాల్ తయారీ కోసం దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెరను వినియోగించాయి. ఇది దేశంలో నమోదైన మొత్తం చక్కెర ఉత్పత్తిలో దాదాపు 10 శాతానికి సమానం. ఒకవేళ రాబోయే సీజన్లో ఇథనాల్ కోసం చెరకు వినియోగాన్ని పరిమితం చేస్తే, ఆ 30 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు చక్కెర దేశీయ మార్కెట్లోకి వస్తుంది. ఇది వర్షాభావం వల్ల ప్రధాన రాష్ట్రాల్లో ఏర్పడే ఉత్పత్తి లోటును సులభంగా భర్తీ చేయగలదు.
నెల రోజుల్లోనే 10 శాతం పెరిగిన ధరలు
భారత్లో పండుగల సీజన్ ప్రారంభం కావడం, మార్కెట్లో చక్కెర లభ్యత తగ్గడం వల్ల గత నెల రోజుల్లోనే చక్కెర ధర సుమారు 10 శాతం వరకు పెరిగి సరికొత్త రికార్డును తాకింది. పరిస్థితి చేయిదాటక ముందే మిల్లులు చెరకు రసం, ఎక్కువ తీపి శాతం ఉండే బి-హెవీ మోలాసెస్ నుంచి ఇథనాల్ తయారు చేయకుండా ఆదేశించే అవకాశం ఉంది. చక్కెరను వేరు చేసిన తర్వాత వచ్చే సి-హెవీ మోలాసెస్ నుంచి మాత్రమే ఇథనాల్ తయారు చేసుకునేందుకు అనుమతించవచ్చని భావిస్తున్నారు.
మొక్కజొన్న, బియ్యం వైపు దృష్టి
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. అందువల్ల చెరకు నుంచి వచ్చే ఇథనాల్ పరిమాణం తగ్గితే, ఆ లోటును భర్తీ చేసేందుకు మొక్కజొన్న, బియ్యం ఆధారిత ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో మొక్కజొన్న, బియ్యం నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండటం కలసివచ్చే అంశం. ఇప్పటికే చక్కెర ఎగుమతులపై నిషేధం విధించిన ప్రభుత్వం, వ్యాపారుల వద్ద ఉండే నిల్వలపై కూడా పరిమితులు విధించింది.