మిడిల్ క్లాస్ మోజు పడిన చిన్న కార్లు ఇవే.. ఏకంగా 1.90 లక్షల ఆర్డర్లతో మారుతీ సుజుకి రికార్డ్

Maruti Suzuki Pending Orders: మొత్తం పెండింగ్ ఆర్డర్లలో సింహభాగం మధ్యతరగతి ప్రజలు ఇష్టపడే చిన్న కార్లవే కావడం విశేషం. ఆల్టో, సెలెరియో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల కోసం దాదాపు 1.30 లక్షల మంది కస్టమర్లు ఎదురుచూస్తున్నారు.

Update: 2026-04-30 06:51 GMT

మిడిల్ క్లాస్ మోజు పడిన చిన్న కార్లు ఇవే.. ఏకంగా 1.90 లక్షల ఆర్డర్లతో మారుతీ సుజుకి రికార్డ్

Waiting Period for Swift WagonR Baleno: భారతీయ రోడ్లపై మారుతి సుజుకి హవా కొనసాగుతోంది. మధ్యతరగతి కుటుంబాల కారు కల అంటేనే మారుతి అన్నట్లుగా పరిస్థితి ఉంది. అయితే, ఇప్పుడు కారు కొనాలనుకునే వారు కాస్త ఓపిక పట్టాల్సిందే. ఏకంగా 1.90 లక్షల పెండింగ్ ఆర్డర్లతో ఈ వాహన దిగ్గజం సరికొత్త రికార్డును నెలకొల్పింది. డిమాండ్ పెరగడంతో డెలివరీ కోసం కస్టమర్లు క్యూ కడుతున్నారు.

మారుతి కార్ల కోసం పెరుగుతున్న నిరీక్షణ..

దేశీయ ఆటోమొబైల్ రంగంలో తిరుగులేని అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, తన 2026 ఆర్థిక సంవత్సర నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. కంపెనీ ప్రస్తుతం 1.92 లక్షల కార్ల పెండింగ్ ఆర్డర్లతో సతమతమవుతోంది. షోరూమ్‌కు వెళ్లి కారు బుక్ చేసుకున్న తర్వాత అది చేతికి రావాలంటే నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది సుమారు 24 లక్షల కార్లను విక్రయించినప్పటికీ, ప్రజల నుంచి వస్తున్న అపారమైన డిమాండ్‌ను అందుకోవడంలో ఉత్పత్తి సామర్థ్యం సరిపోవడం లేదు.

చిన్న కార్లకే పట్టం కడుతున్న సామాన్యులు..

మొత్తం పెండింగ్ ఆర్డర్లలో సింహభాగం మధ్యతరగతి ప్రజలు ఇష్టపడే చిన్న కార్లవే కావడం విశేషం. ఆల్టో, సెలెరియో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల కోసం దాదాపు 1.30 లక్షల మంది కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. డీలర్ల వద్ద కూడా కేవలం 12 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సాధారణంగా ఈ రకమైన కార్ల కోసం సగటున ఒక నెల నిరీక్షణ సమయం ఉంటోంది.

ఉత్పత్తి పెంపుపై కంపెనీ భారీ పెట్టుబడులు..

పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సమాయత్తమవుతోంది. గుజరాత్‌లోని ఖోరాజ్ పారిశ్రామిక ప్రాంతంలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. దీని కోసం సుమారు 10,189 కోట్ల రూపాయల భారీ పెట్టుబడిని కేటాయించింది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా ఏటా అదనంగా 2.50 లక్షల వాహనాలను తయారు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హర్యానా, గుజరాత్‌లోని ప్లాంట్లు తమ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి.

కస్టమర్లపై ధరల భారం పడే అవకాశం?

ముడి సరుకుల ధరలు పెరగడం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది. ఇప్పటివరకు కస్టమర్లపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, భవిష్యత్తులో వాహనాల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులను సమీక్షించిన తర్వాత ధరల పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు. పెట్రోల్ కార్లతో పాటు సీఎన్జీ, హైబ్రిడ్ మోడళ్లపై మారుతి ప్రత్యేక దృష్టి సారిస్తుండటంతో కస్టమర్ల ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు.

Tags:    

Similar News