Weather Update : విలయతాండవం చేస్తున్న ఎండలు.. రానున్న 48 గంటలు అత్యంత కీలకం
Weather Update : ఏపీ, తెలంగాణలో ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక జారీ అయింది.
Weather Update
Weather Update : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతోంది. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ముఖ్యంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 16 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ 41 మండలాల్లో తీవ్ర ఎండలు ఉంటాయని అంచనా.
ఉత్తరాంధ్రపై వడగాల్పుల పంజా
ప్రస్తుత ఎండల ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలపై పడనుంది. విజయనగరంలో 19 మండలాలు, శ్రీకాకుళంలో 13 మండలాలు, పార్వతీపురం మన్యంలో 11 మండలాలు వడగాల్పుల బారిన పడే అవకాశం ఉంది. వీటితో పాటు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పోలవరం ప్రాంతాల్లోని పలు మండలాలు కూడా ప్రభావితం కానున్నాయి. ఇప్పటికే విజయనగరం జిల్లా రాజాంలో 40.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలోనూ ఎండల జోరు
పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును తాకుతున్నాయి. ఏప్రిల్ నెల మొత్తం ఇదే తరహాలో తీవ్ర ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అయితే కొన్ని చోట్ల సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, పగటిపూట మాత్రం ఎండ తీవ్రత అధికంగానే ఉండనుంది.
ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి
ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు దాహం వేయకపోయినా మంచినీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడం మంచిది. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీలు ధరించి, వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలని సూచిస్తున్నారు.




