Kadiri: కదిరిలో ఘోరం.. హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్!
Kadiri: బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దని మందలించినందుకు జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడిపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Kadiri: కదిరిలో ఘోరం.. హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్!
కదిరి: సత్యసాయి జిల్లా కదిరి టౌన్ కు చెందిన పటాన్ ఇంతియాజ్ స్థానిక ఎంఆర్వో కార్యాలయం సమీపంలో జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. 17-07-2026 తేదీ రాత్రి సుమారు 9:00 గంటల సమయంలో, ఇంతియాజ్ తన స్నేహితులతో కలిసి కదిరి రైల్వే స్టేషన్ సమీపంలోని దేవళం ఉట్టి వద్ద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా, గాంధీనగర్కు చెందిన షేక్ ముజాహిద్ @ ముజ్జు మరియు అతని స్నేహితుడు షేక్ ఆదిల్, గాలివీడు మండలం, వెలిగళ్ళు గ్రామ నివాసి, అక్కడికి వచ్చి వారి సమీపంలో కూర్చొని బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించడం ప్రారంభించారు.
దీనిని గమనించిన ఇంతియాజ్, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దని వారిని మందలించగా, నిందితులు ఇంతియాజ్ తొ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో షేక్ ఆదిల్ ఇంతియాజ్ ను పట్టుకోగా, షేక్ ముజాహిద్ @ ముజ్జు తన వద్ద ఉన్న కత్తితో ఇంతియాజ్ మెడ భాగంలో పొడిచి హత్య చేయడానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్ ను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, కదిరికి తరలించి చికిత్స అందించారు. అనంతరం బాధితుడు చికిత్స పొందుతూ ఇచ్చిన ఫిర్యాదు/వాంగ్మూలం మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.
దర్యాప్తులో భాగంగా, ఈ రోజు అనగా 21-07-2026 ఉదయం సుమారు 10: 30 గంటలకు, నిందితులు షేక్ ముజాహిద్ @ ముజ్జు , షేక్ ఆదిల్ (20), తండ్రి: షేక్ జైనుల్లాను కదిరి–మదనపల్లి రోడ్డులోని కౌలేపల్లి రైల్వే గేట్ సమీపంలో కదిరి టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది అరెస్ట్ చేశారు.
నిందితుల స్వాధీనంలో నుండి నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకొని, తదుపరి చట్టపరమైన చర్యలు పూర్తి చేసి, ఇద్దరు నిందితులను గౌరవ న్యాయస్థానం ముందు హాజరు పరచడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.
ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గొడవలకు దిగడం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని, అంతే కాకుండా ఇలాంటి తీవ్ర నేరాలకు పాల్పడిని వారిపై రౌడీ షీట్ లు ఓపెన్ చేసి వారి పై నిఘా ఉంచడం మరియు ఇలాంటి తరుచూ నేరాలు చెవారి పై PD ఆక్ట్ పెట్టుటకు జిల్లా కలెక్టర్ గారికి తగిన రిపోర్ట్ పంపడం జరుగుతుందని కదిరి పోలీసులు హెచ్చరించారు.