Nirmal: అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్‌కు ఘన వీడ్కోలు

Nirmal: నిర్మల్ జిల్లాలో అదనపు కలెక్టర్‌గా పనిచేసి వరంగల్ జిల్లాకు బదిలీ అయిన కిషోర్ కుమార్‌తో పాటు పదవీ విరమణ పొందిన అధికారులకు కలెక్టర్ భవేష్ మిశ్రా ఘనంగా వీడ్కోలు పలికారు.

Update: 2026-08-31 14:13 GMT

Nirmal: అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్‌కు ఘన వీడ్కోలు

నిర్మల్: నిర్మల్ జిల్లాకు రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా కిషోర్ కుమార్ అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో బదిలీలు, పదవీ విరమణలు సహజమని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ వరంగల్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బాలిగ్ అహ్మద్, ఏడి ల్యాండ్ సర్వే రికార్డ్స్ నరసింహమూర్తి పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కిషోర్ కుమార్ రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా భూ సమస్యల పరిష్కారం, ధాన్యం కొనుగోళ్లు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లను సకాలంలో, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చేయడంలో ఆయన కీలకంగా పనిచేశారని అభినందించారు. వరంగల్ జిల్లాలోనూ ఇదే అంకితభావంతో పనిచేసి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.

అలాగే, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా బాలిగ్ అహ్మద్, ఏడి ల్యాండ్ సర్వే రికార్డ్స్‌గా నరసింహమూర్తి సుదీర్ఘకాలం క్రమశిక్షణతో విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందారని కలెక్టర్ తెలిపారు. అనుభవజ్ఞులైన ఈ అధికారులు పదవీ విరమణ చేయడం జిల్లాకు లోటేనని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా భావి జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

వీడ్కోలు సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో విధులు నిర్వహించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తన విధుల నిర్వహణలో సహకరించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

పదవీ విరమణ పొందిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బాలిగ్ అహ్మద్, ఏడి ల్యాండ్ సర్వే రికార్డ్స్ నరసింహమూర్తి మాట్లాడుతూ, తమ ఉద్యోగ జీవితంలో సహకరించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News