కరోనా కాలంలోనూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. సన్నిధికి సంబంధించిన ప్రధాన కట్టడాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రధానాలయం తుది మెరుగులు పరిస్థితులు అనుకూలిస్తే ప్రభుత్వ ఆదేశాల నిర్ణయం మేరకు విజయదశమికి నాటికి స్వామివారి ఆలయం పూర్తవుతుందని యాడ సంస్థ అంచనా వేస్తుంది.
ప్రధానాలయంలో ఆరు రాజగోపురాలు, దివ్య విమానం, నలువైపులా అష్టభుజ మండపం ప్రాకారాలు, ఉప ఆలయాలు, గర్భాలయ ద్వారాలు పూర్తి అయ్యాయి. గర్భాలయ ప్రవేశ ద్వారంపై పంచలోహ ప్రతిమలతో ప్రహ్లాద చరితం, రామానుజ కూటమి, యాగశాల, ధ్వజస్తంభ బలిపీఠం, మహాముఖ మండపం, పడమటి దిశలో వేంచేపు మండపం, జయ, విజయముల విగ్రహాలు, ఐరావతం ప్రతిమల ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ప్రధానాలయ గోపురాలకు తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. అష్టభుజ మండప ప్రాకారాలలోని రూపాలకు మెరుగులు దిద్దుతున్నారు. ఆలయం నలువైపులా ఉన్న సాలహారాలలో విష్ణు మూర్తుల విగ్రహాల పొందికను చేపట్టారు. అద్దాల మండపం ఏర్పాట్లు ఆలయ ప్రవేశ మార్గం ఇరువైపులా ఉన్న శిల్పాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక యాదాద్రి ప్రధాన ఆలయం కొలువై ఉన్న కొండ చుట్టూ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ప్రెసిడెన్షియల్ సూట్, పద్నాలుగు వీవీఐపీ విల్లాలు యాభై శాతం మేర పనులు పూర్తి అయ్యాయి. యాదాద్రి ప్రధాన ఆలయానికి ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో దానికి అనుగుణంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా అత్యాధునికమైన రీతిలో బస్స్టాండ్, కోనేరు, పెద్ద గుట్టపై సూట్ల నిర్మాణం చేపడుతుంది.
శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్న ప్రధాన ఆలయం పనులు తొంభై శాతం పూర్తి అయ్యాయి. తుది మెరుగుల కోసం ప్రధాన ఆలయంలోని నీరు పారుదలకు పైపులు వేసే పనులు, దక్షిణ దిశలో వాహన శాల నిత్య కళ్యాణ మండపం, ప్రసాదం తయారీ విక్రయశాల సముదాయంలో పనులు జరుగుతున్నాయి. మెట్లదారుల పునరుద్ధరణతో పాటు స్వామి వారి అనుబంధ ఆలయం అయినటువంటి శివాలయ పునర్ నిర్మాణంలోనూ ప్రధాన కట్టడాలు పూర్తికావొచ్చాయి. అయితే మొత్తం ఆలయ అభివృద్ధిలో ప్రధాన ఆలయం పనులు పూర్తి అయిన మిగతా భక్తుల కోసం చేపట్టే మౌలిక వసతుల పనులు పూర్తి కాలేదు. దీంతో ఈ దసరాకి ప్రధాన గర్భ గుడిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అనేది ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉందని వైటీడీఏ అధికారులు చెప్పుకొస్తున్నారు.