సకాలంలో 108 అంబులెన్స్ రాలేదు, ఆ ఊరిలో ఆస్పత్రి కూడా లేదు, ప్రసవ సమయంలో సాయమందించాల్సిన అంగన్ కార్యకర్త, ఏఎన్ఎం తోడుగా నిలవలేదు. దీంతో చివరకు ప్రసవ వేదన పడుతున్నా అటుగా వెళ్తున్న వారెవరూ సాయం చేయలేదు ఇంతటి నిస్సహాయ స్థితిలో రోడ్డుపైనే ఓ మహిళకు ప్రసవం జరిగిపోయింది.
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వాయిపేట్కు చెందిన రాధ అనే మహిళకు పురిటి నొప్పులు మొదలవడంతో ఏఎన్ఎంకు సమాచారమిచ్చారు. ఆమె ఐటీడీఏ అవ్వాల్ వాహన సిబ్బందిని సంప్రదించగా, నెల రోజులుగా డీజిల్ లేక వాహనం నడవడం లేదని సమాధానమిచ్చారు. దీంతో108 అంబులెన్స్కు ఫోన్ చేయగా, అదీ అందుబాటులోకి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా, సిరికొండ సమీపంలో నొప్పులు ఎక్కువయ్యాయి. రోడ్డుపైనే అదే వాహనాన్ని అడ్డుపెట్టి, చుట్టూ చీరలు కట్టి కుటుంబ సభ్యులే ప్రసవం చేశారు. మగబిడ్డను ప్రసవించిన ఆమెను ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగరం పీహెచ్సీకి తీసుకెళ్లారు.