తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది. పగలు ఎండ సూర్రుమనిపిస్తోంది. రాత్రైతే చలి చంపేస్తోంది. పూర్తిగా ఎండాలేదు పూర్తిగా చలిలేదు. ఒకే రోజులు రెండు రకాల వెదర్తో జనం అల్లాడిపోతున్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతుండగా రాత్రిపూట ఉష్ణోగ్రత దారుణంగా పడిపోయి వణికిస్తోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలకు పైగా నమోదవుతుండగా సాయంత్రం ఆరు గంటలకే చలిమొదలై, తెల్లవారుజాముకు పొగమంచు కమ్మేస్తోంది. రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత 16.5 డిగ్రీల సెల్సీయస్ కు పడిపోతున్నాయి. గడచిన రెండు మూడ్రోజులు నుంచి ఇదే పరిస్థితి నెలకొంది.
ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే ఇటువంటి విచిత్ర వాతావరణం నెలకొనివుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈశాన్య భారతం నుంచి చల్లటి గాలులు వీస్తుండటంతో వాతావరణం మరింత చల్లగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో పగలు పొడిగా రాత్రి అత్యంత తీవ్ర చలిగా ఉంటుందని తెలిపారు. వాతావరణంలో వస్తున్న మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు.