తెలంగాణలో నిర్వహించే బోనాల్లో.. లాల్దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే లాల్దర్వాజ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్ను ముంచెత్తుతున్న సమయంలో నిజాం నవాబు సింహవాహని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని.. ఆపద గట్టెకిస్తే.. గుడికట్టిస్తానని వేడుకున్నారని ప్రతీతి. అప్పటి నుంచి లాల్దర్వాజ బోనాల ఆనవాయితీ కొనసాగుతుందంటారు భక్తులు. ఇంతటి విశిష్ఠత ఉన్న ఈ బోనాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
హైదరాబాద్ అంతటా బోనాల జాతర వైభవంగా జరిగింది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడాయి. తెల్లవారుజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 5 గంటలకు అమ్మవారిని అభిషేకించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పట్టువస్త్రాలు సమర్పించారు.
కాంగ్రెస్ నాయకులు విజయశాంతి అమ్మవారికి బోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆమె అమ్మవారిని కోరుకున్నారు. ప్రభుత్వం అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. సినీనటి పూనమ్కౌర్ కూడా బోనమెత్తారు. పీవీ సింధు ఆదివారం లాల్దర్వాజా సింహవాహని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.
అమ్మవారిని దర్శించిన వారిలో మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ కేంద్ర మంత్రి బండారుదత్తాత్రేయ, నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి, ఆర్డిఓ శ్రీనివాస్ రెడ్డి, చంద్రకళ, ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, ఎమ్మెల్యే రాజా సింగ్, నటుడు సుమన్ తదితరులు ఉన్నారు.