కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. పేదరికాన్ని జయించి చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు విద్యార్ధినులకు కేటీయార్ ఈరోజు ఆర్థిక సాయం అందించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ గ్రామానికి చెందిన రచన అనే యువతి ఇంజినీరింగ్ చదువు బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన సీబీఐటీ కళాశాలలో విద్యనభ్యసించేందుకు సీటు వచ్చిన ఫీజు చెల్లించలేని ఆమె దీనస్థితి తెలుసుకున్న కేటీఆర్ సదరు విద్యార్థిని పిలిపించుకుని కావాల్సిన సాయాన్ని అందజేశారు.
రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంది. పాల్టెక్నిక్ పూర్తిచేసి హైదరాబాద్లోని గండిపేట సీబీఐటీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సీటు సాధించింది. అయితే ఫీజు చెల్లించలేని స్థితిలో ఆపన్నుల కోసం ఎదురు చూస్తుంది. విషయం తెలిసిన కేటీఆర్ తన పెద్ద మనసును మరోసారి చాటుతూ విద్యార్థిని చదువుకు కావాల్సిన ఆర్థికసాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పూర్తి శ్రద్ద విద్యపైనే పెట్టాలని రచనకు సూచించారు. ఆర్థిక సాయం అందుకున్న తర్వాత రచన తనలాగే అనేకమంది విద్యావంతులైన అనాథలు రాష్ట్రంలో ఉన్నారని వారి కోసం ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కేటీఆర్కు విజ్ఞప్తి చేసింది.
ఇక పేదరికాన్ని జయించి ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థిని మేకల అంజలికి కూడా కేటీఆర్ చేయూత అందించారు. అంజలి ఐఐటీ ఇండోర్ లో సీటు సాధించినప్పటికీ ఆమె తండ్రికి ఫీజు చెల్లించే ఆర్థిక స్తోమత లేదు అంజలి ఆమె బాధను వివరిస్తూ కేటీఆర్ కు ట్విట్ చేసింది. దీనికి స్పందించిన కేటీఆర్ ఆమెకు ఆర్థిక సాయం అందించారు. మొత్తానికి కేటీఆర్ ఇలా పేద విద్యార్థులను ఆదుకోవడాన్ని అందరూ కొనియాడుతున్నారు.