తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మూడు స్థానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రం దృష్టిని ఆకర్షించాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలోనూ ఉత్కంఠను రేపాయి.
మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టిఆర్ఎస్కు గట్టి షాకే ఇచ్చారు. కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీల్లో తన వాళ్లకు కాకుండా వేరే వారికి టిక్కెట్లు ఇచ్చారనే ఆగ్రహంతో కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 20 స్థానాల్లో తన మద్దతుదారులను బరిలోకి దింపారు. వారిలో 16 మంది విజయం సాధించారు. దీంతో కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఆయన మద్దతుదారుల సొంతమైంది.
అంతేకాదు ఐజా మున్సిపాలిటీ పరిధిలోనూ జూపల్లి అనుచరుల హవా కొనసాగింది. అక్కడ కూడా తనమద్దతుదారులను ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపారు. అక్కడ 20 మందిలో పది మందిని గెలిపించుకోవడంతో ఇక్కడ కూడా జూపల్లినే కింగ్ మేకర్గా మారారు.
భైంసాలో ఎన్నికల పోరు కూడా ఉత్కంఠగా నిలిచింది. విజయం కోసం ఎంఐఎం, బీజేపీ తీవ్రంగా పోటీపడ్డాయి. ఈ స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా ఇందులో ఎంఐఎం 15 వార్డులను గెలుచుకుంది. BJP 9 స్థానాల్లో గెలుపొందింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. స్వతంత్రులు రెండు వార్డులను సొంతం చేసుకున్నారు. ఎన్నికల ముందు తీవ్ర ఘర్షణలతో వార్తల్లో నిలిచిన భైంసాలో పుర పోరు ఉత్కంఠ భరితంగా మారింది.
గత ఎన్నికల్లోనూ భైంసా మున్సిపాలిటీలో సొంతం చేసుకున్న ఎంఐఎం మరోసారి అదే ఫలితాలను పునరావృతం చేసి పట్టు నిలుపుకుంది. అయితే బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని 9 వార్డుల్లో విజయం నమోదు చేసింది.