గ్లోబల్ సమిట్లో తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ.. రూ.5,39,495 కోట్లకు చేరిన పెట్టుబడులు
తెలంగాణ ఫ్యూచర్ సిటీలో రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండో రోజు కొనసాగుతోంది. పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.
తెలంగాణ ఫ్యూచర్ సిటీలో రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండో రోజు కొనసాగుతోంది. పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో సీఎం రేవంత్ బిజీగా ఉన్నారు. ఆయన సమక్షంలో పలు కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకుంటున్నాయి. గోద్రెజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఫిరోజ్ షా గోద్రెజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్ స్వామి సమావేశమయ్యారు. హైదరాబాద్లో తమ సంస్థ విస్తరణపై ఫిరోజ్షా గోద్రెజ్ సీఎంతో చర్చించారు. పాలు, ఎఫ్ఎంసీజీ, రియల్ఎస్టేట్, ఆయిల్పామ్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ఆసక్తి చూయించింది. మరోవైపు సుమధుర గ్రూప్, టీసీసీఐ తైవాన్ గ్రూప్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి.
తెలంగాణలో వేయ్యి కోట్లు పెట్టుబడి పెట్టేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకొచ్చింది. సీఆర్డీఎంవో నిర్మాణానికి వెయ్యి కోట్ల రూపాయాలు పెట్టుబడి పెట్టనుంది. వచ్చే నాలుగేళ్లలో 200 మందికిపైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్డీ సెంటర్ కోసం ఫెర్టిస్ ఇండియాతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రెండు దశల్లో ఫెర్టిస్ ఇండియా 2 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఫుడ్ అండ్ బేవరేజెస్ యూనిట్-2 విస్తరణకు కేజేఎస్ ఇండియా ఒప్పందం కూడా కుదర్చుకుంది. ఫ్రీజ్- డ్రైడ్ కాఫీ ప్లాంట్ నిర్మాణానికి వింటేజ్ కాఫీ అండ్ బేవరేజెస్ ఒప్పందం కుదుర్చుంది.
ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ తయారీ యూనిట్కు ఆర్సీపీఎల్, ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ సేవల విస్తరణకు కైన్స్ టెక్నాలజీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు జేసీకే ఇన్ఫ్రా, మూడు దశల్లో 2 వేల 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఆర్సీటీ ఎనర్జీ ఇండియా, 50 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ డేటా సెంటర్కు అక్వెలోన్ నెక్సస్, హైపర్స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు ఏజీపీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.